న్యూఢిల్లీ: డయాబెటిస్ బాధితులకు ప్రముఖ అంతర్జాతీయ ఔషధ సంస్థ ‘నోవో నార్డిస్క్’ తీపి కబురు అందించింది. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా వారానికి ఒకసారే తీసుకునే ఇన్సులిన్ ‘అవిక్లి’ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇప్పటివరకు రోగులు రోజుకో ఇంజెక్షన్ చొప్పున ఏడాదికి 365 సార్లు ఇంజెక్షన్లు తీసుకుంటున్నారు. అవిక్లిని కేవలం 52 సార్లు తీసుకుంటే సరిపోతుంది. ఈ థెరపీ అందుబాటులోకి వచ్చిన ప్రపంచ దేశాల్లో భారత్ ఆరో స్థానంలో నిలిచింది.
భారత్లో ఇన్సులిన్ వాడకాన్ని రోగులు సగటున 7 నుంచి 9 ఏండ్లపాటు వాయిదా వేయడానికి ప్రధాన కారణం 'రోజువారీ ఇంజెక్షన్ల భయం'. ఈ భయాన్ని పోగొట్టేలా కేవలం ఒకే ఒక్క ‘ఫ్లెక్స్ టచ్’ పెన్ ద్వారా వారపు డోసును తీసుకోవచ్చు. దీని ధరలు కూడా తక్కువగానే ఉన్నాయి. ఒక మిల్లీలీటర్ (ఎంఎల్) పెన్ (700 యూనిట్లు) ధర రూ. 2,611 కాగా, 3 ఎంఎల్ పెన్ (2,100 యూనిట్లు) ధర రూ. 7,833 గా ఉంది. ఒక రోగి వారానికి సుమారు 70 యూనిట్ల చొప్పున ఇన్సులిన్ తీసుకుంటే, వారానికి అయ్యే ఖర్చు రూ.261 నుంచి రూ.263 లోపే ఉంటుంది.
