న్యూఢిల్లీ: స్పెషల్ ఎకనామిక్ జోన్లను (సెజ్) మరింత ముందుకు తీసుకెళ్లడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. వీటిలో తయారు చేసిన ఉత్పత్తులను దేశీయ మార్కెట్లో విక్రయించడానికి అనువైన ఫ్రేమ్వర్క్ను తయారు చేయనుంది. డీ-నోటిఫికేషన్ నిబంధనలను సులభతరం చేయనుంది. యూనిట్ల అప్రూవల్ సిస్టమ్స్ను క్రమబద్ధీకరించనుంది. సెజ్లను పునరుద్ధరించడంతోపాటు సెజ్ దేశీయ టారిఫ్ ఏరియా (డీటీఏ) లేదా దేశీయ మార్కెట్ మధ్య వ్యాపార లావాదేవీలను సులభతరం చేస్తామని సంబంధిత అధికారి ఒకరు చెప్పారు.
వాణిజ్యం, కస్టమ్స్ సుంకాల విషయంలో సెజ్లను ప్రస్తుతం విదేశీ భూభాగాలుగా పరిగణిస్తున్నారు. దేశీయ మార్కెట్లో ఈ జోన్ల వెలుపల సుంకం -రహిత అమ్మకాలపై పరిమితులు ఉన్నాయి. ఈ చర్యలపై వివిధ మంత్రిత్వ శాఖల అభిప్రాయాలను కోరేందుకు, వాణిజ్య మంత్రిత్వ శాఖ ముసాయిదా సెజ్ (ప్రత్యేక ఆర్థిక మండలి) సవరణ బిల్లు 2023పై ఒక నోట్ను రిలీజ్ చేసింది. దీనిపై మంత్రిత్వ శాఖల మధ్య సంప్రదింపులు వేగంగా జరుగుతున్నాయి.
వచ్చే డిసెంబర్ 4న ప్రారంభమై డిసెంబర్ 22 వరకు కొనసాగనున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ప్రతిపాదిత డెవలప్మెంట్ ఆఫ్ ఎంటర్ప్రైజ్ అండ్ సర్వీస్ హబ్స్ బిల్లు స్థానంలో దీనిని తీసుకొస్తారు.