- స్థానిక ఉత్పత్తికి సహకారం
- రూ.2.26 లక్షల కోట్లకు ఎగుమతులు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఆటోమొబైల్ సెక్టార్కోసం తీసుకొచ్చిన ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్(పీఎల్ఐ) పథకం ఈవీల వాడకాన్ని పెంచడానికి ఎంతగానో ఉపయోగపడుతోంది. ఈ పథకం వల్ల ఇప్పటికే రూ.45,477 కోట్ల పెట్టుబడులు, 67 వేలకు పైగా ఉద్యోగాలు వచ్చాయి. రూ.11,900 కోట్ల పీఎం ఈ–-డ్రైవ్ పథకం ద్వారా ఎలక్ట్రిక్ వాహనాలు, బస్సులు, చార్జింగ్ మౌలిక వసతులకు చేయూత ఇస్తున్నారు.
బ్యాటరీ స్టోరేజ్ పీఎల్ఐ కింద మరో రూ.18,100 కోట్లతో 50 గిగావాట్ల దేశీయ ఎనర్జీ స్టోరేజీ సామర్థ్యాన్ని నిర్మిస్తున్నారు. 2026 ఆర్థిక సంవత్సరంలో ఆటో కాంపోనెంట్ పరిశ్రమ టర్నోవర్ 12.7 శాతం వృద్ధితో రూ.7.6 లక్షల కోట్లకు చేరగా, ఎగుమతుల విలువ రూ.2.26 లక్షల కోట్లకు ఎగిసింది. ఆటో రంగం విస్తరణకు, స్థానిక ఉత్పత్తిని పెంచడానికి, అడ్వాన్స్డ్ మొబిలిటీ టెక్నాలజీలను అభివృద్ధి చేసి ఎగుమతి చేయడానికి భారతీయ కంపెనీలకు సహకరించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా
పెట్టుకుంది.
నిధుల కేటాయింపు ఇలా...
- ఆటో పీఎల్ఐ (రూ.25,038 కోట్ల వ్యయం): ఆమోదం పొందిన దరఖాస్తుదారులు రూ.45,477 కోట్ల పెట్టుబడులను ప్రకటించారు. 67 వేలకుపైగా ఉద్యోగాలను ఇచ్చారు. అధిక ఉత్పత్తితోపాటు దేశీయ విలువ జోడించడం, అడ్వాన్స్డ్ ఆటోమోటివ్ టెక్నాలజీలో సామర్థ్యాలను పెంచడం దీని లక్ష్యం.
- ఈవీల కోసం పీఎం ఈ–-డ్రైవ్: ఈ పథకం వ్యయం రూ.1,000 కోట్లకు పెంచడంతో రూ.11,900 కోట్లకు చేరింది. దీని ద్వారా 45,79,000 ఎలక్ట్రిక్ టూ-వీలర్లకు రాయితీలు దక్కాయి. ఇప్పటివరకు 25,66,000 కంటే ఎక్కువ ఎలక్ట్రిక్ టూ-వీలర్లు, 2,75,000 ఎలక్ట్రిక్ త్రీ-వీలర్లు, 53 ఎలక్ట్రిక్ ట్రక్కులకు ప్రోత్సాహకాలు ఇచ్చారు.
- ఎలక్ట్రిక్ బస్సులు: ఈ–బస్సుల కోసం రూ.4,391 కోట్లు కేటాయించగా, 13,800 బస్సులకు ఇప్పటికే కేటాయింపులు పూర్తయ్యాయి. రూ.3,435 కోట్ల వ్యయంతో కూడిన పేమెంట్ సెక్యూరిటీ మెకానిజం ద్వారా 38 వేలకుపైగా ఎలక్ట్రిక్ బస్సుల ఆపరేటర్లకు మేలు జరుగుతోంది. పబ్లిక్ ఛార్జింగ్ కోసం రూ.2,000 కోట్లు కేటాయించారు.
- బ్యాటరీ స్టోరేజ్ పీఎల్ఐ (రూ.18,100 కోట్లు): ఈ పథకం ద్వారా 50 గిగావాట్ల దేశీయ అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ సెల్ బ్యాటరీ సామర్థ్యాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇది ఈవీలు, గ్రిడ్ స్టోరేజ్కు కీలకమైన ఇంధనాన్ని అందిస్తుంది. అంతేగాక ఎలక్ట్రిక్ మోటార్లకు కీలకమైన సింటెర్డ్ రేర్-ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్ల దేశీయ ఉత్పత్తి సామర్థ్యాన్ని ప్రభుత్వం పెంచుతోంది.
