- పెరుగుతున్న ఈవీల వినియోగం..
- 13.2 లక్షల ఛార్జింగ్ పాయింట్లు అవసరం..
- రుబిక్స్ డేటా సైన్సెస్ రిపోర్ట్
న్యూఢిల్లీ: దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) వినియోగం వేగంగా పెరుగుతుండడంతో ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విస్తరించడం కీలకంగా మారింది. 2030 నాటికి భారతదేశానికి ఏకంగా 13.2 లక్షల ఈవీ ఛార్జింగ్ పాయింట్లు అవసరమవుతాయని మార్కెట్ రీసెర్చ్ సంస్థ రుబిక్స్ డేటా సైన్సెస్ ఓ రిపోర్ట్లో పేర్కొంది. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) అంచనాలను ప్రస్తావించింది.
2026 ఆగస్టు నాటికి దేశవ్యాప్తంగా కేవలం 67,657 ఛార్జింగ్ పాయింట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ‘‘2022లో 5 వేలుగా ఉన్న పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్ల సంఖ్య 2025 డిసెంబర్ నాటికి దాదాపు ఆరు రెట్లు పెరిగి 29,151కి చేరింది. కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు ఈ విస్తరణలో ముందంజలో ఉండగా, దేశంలోని మొత్తం నెట్వర్క్లో టాప్ 10 రాష్ట్రాల వాటాయే 78 శాతంగా ఉంది.
స్టేషన్ల సంఖ్య పెరుగుతున్నప్పటికీ, వాటి వినియోగం కేవలం 1శాతం నుంచి 5శాతం మధ్యనే ఉండటంతో ఛార్జ్ పాయింట్ ఆపరేటర్ల ఆదాయంపై ప్రభావం పడుతోంది”అని వివరించింది. ప్రస్తుతం ఉన్న 66,518 నాన్-స్వాపింగ్ ఛార్జింగ్ పాయింట్లలో దాదాపు 73శాతం (48,709) ఛార్జర్లు 30 కిలోవాట్ల (కేడబ్ల్యూ) కంటే తక్కువ సామర్థ్యం కలిగినవే.
