
- ఇంత పనిచేస్తున్నా వేధింపులేంటని మండిపాటు
- కోట్లు ఖర్చు చేసి యాప్లు తెస్తున్నరు
- పనిచేసేందుకు ఎక్విప్మెంట్లు ఇవ్వట్లేదని ఆవేదన
హైదరాబాద్, వెలుగు: వ్యవసాయ శాఖ క్షేత్ర స్థాయిలో పనిచేసే అగ్రిఎక్స్టెన్షన్ ఆఫీసర్ల (ఏఈఓ) పై ప్రత్యేక ట్రాకింగ్ సిస్టమ్ను ప్రభుత్వం అమలు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2,600 ఏఈవోలకు ఈ జియో ట్యాగింగ్ను అమలు చేస్తున్నది. ఏఈవోలు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు వంటి విషయాలు ఎప్పటికప్పడు తెలుసుకునేందుకు యాక్టివిటీ లాగర్ యాప్ పేరుతో జియోట్యాగింగ్ చేసే జీపీఎస్ వ్యవస్థను తీసుకువచ్చింది. పనిచేయని వారిని పట్టించుకోకుండా నిత్యం రైతులకు అందుబాటులో ఉండే తమపైనే ఈ వేధింపులు ఏంటని ఏఈవోలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఫీల్డ్ లెవెల్లో యాక్టివ్గా ప్రభుత్వ స్కీమ్ లను అమలుచేస్తూ డిపార్ట్మెంట్కు గుర్తింపు తెస్తుంటే తమపై వేధింపులా అని వారు ప్రశ్నిస్తున్నారు.
డేటా ఎంట్రీ ఆపరేటర్లలా పనిచేస్తున్నం
వ్యవసాయ శాఖలో పనిచేయాలనే ఉత్సాహంతో అగ్రికల్చర్ డిగ్రీలు, పీజీలు చేసి ఏఈవోలుగా జాయిన్ అయ్యామని, ఐదేళ్లయినా ప్రమోషన్లు లేవని ఏఈవోలు వాపోతున్నారు. ‘‘రైతు వేదికల్లో మేమే అటెండర్లం. మేమే ఆఫీసర్లం. పంటలపై అధ్యయనం చేసి రైతులకు సూచనలు చేయాల్సిన మేము ఇప్పుడు కంప్యూటర్ డేటా ఎంట్రీ ఆపరేటర్లలా పని చేస్తున్నం. ఇది చాలదన్నట్లు ఏఈవోల యాక్టివిటీ లాగర్ పేరుతో జీపీఎస్ ద్వారా జియోట్యాగింగ్ చేస్తూ వేధింపులకు గురి చేస్తున్నరు. రూ.కోట్లు ఖర్చు చేసి యాక్టివిటీపై నిఘా కోసం యాప్లు తెస్తున్నరు. కానీ ఫీల్డ్లో యాక్టివిటీ కోసం అవసరమయ్యే ల్యాప్ట్యాప్లు, ట్యాబ్లు, ఆఫీసులో కంప్యూటర్లు, సాయిల్ టెస్టింగ్ కిట్లు మాత్రం ఇవ్వడం లేదు” అని ఏఈవోలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 80 శాతం ఏఈవోల ట్యాబ్లు పని చేయడం లేదని, పనికిరాని ట్యాబ్లు ఇచ్చి రెండు వారాల్లో రైతుబీమా, క్రాప్ బుకింగ్ చేయాలంటే ఎలా చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లయినా ఇప్పటి వరకు కొత్తగా కంప్యూటర్లు, ల్యాప్ ట్యాప్లు ఇవ్వలేదని, అవి ఇస్తే రైతుబంధు, రైతుబీమా, క్రాప్ బుకింగ్ పనులు స్పీడప్ అవుతాయని తెలిపారు. అవేవీ చేయకుండా కొత్త యాప్ల కోసం రూ.కోట్లు ఖర్చు చేస్తున్నారని విమర్శించారు. యాప్లు తెస్తున్నరు, కానీ యాప్లను వినియోగించే ల్యాప్ట్యాప్ లు ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. ‘‘ఫీల్డ్లో రోజు తిరగాలంటే నెలకు రూ.4 వేలు పెట్రోల్కే ఖర్చవుతోంది. బస్సు చార్జీల ఆధారంగా ఐదేళ్లుగా రూ.900 ట్రావెలింగ్ అలవెన్స్ ఇస్తున్నరు. బస్ చార్జీలు పెరిగినా అలవెన్స్ పెరగలే. రైతు వేదికలకు రూ.9 వేల మెయింటెన్స్ ఇస్తామని అన్నారు. నెలకు రెండు వేలు కూడా ఇస్తలేరు”అని ఏఈవోలు వాపోతున్నారు.
ఐటీ టీంతోనే ఆగమైతున్నం
వ్యవసాయ విభాగంలో ఔట్సోర్సింగ్ ఐటీ విభాగమే డిపార్ట్మెంట్ను భ్రష్టు పట్టిస్తోందని ఏఈవోలు అంటున్నారు. ఓ ఉన్నతాధికారి ఏ డిపార్ట్మెంట్కు పోయినా ఐటీ టీమ్ అక్కడ తిష్ట వేసి సంస్థను ఆగం పట్టిస్తోందని ఆరోపించారు. గతంలో పంచాయతీరాజ్ లో ఫీల్డ్ అసిస్టెంట్లను ఇదే రకంగా యాప్లతో వేధించారని, ఐటీ వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకుని ఇప్పుడు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ను ఆగం చేస్తున్నరని ఆగ్రహం వ్యక్తం చేశారు.