చెత్త నుంచి బంగారం: ఈ-వ్యర్థాల నుంచి లిథియం, కోబాల్ట్‌ తీయడానికి రూ.1,500 కోట్ల పెట్టుబడి..

  చెత్త నుంచి బంగారం: ఈ-వ్యర్థాల నుంచి లిథియం, కోబాల్ట్‌ తీయడానికి రూ.1,500 కోట్ల పెట్టుబడి..

భారతదేశం ఎలక్ట్రానిక్ వ్యర్థాలను రీసైకిల్ చేయడానికి అలాగే క్లిన్  ఎనర్జీ, వస్తువుల తయారీకి చాలా అవసరమైన ముఖ్యమైన ఖనిజాలను తిరిగి పొందడానికి ప్రయత్నాలను పెంచుతోంది. పారేసిన ఎలక్ట్రానిక్స్, పాత బ్యాటరీల నుండి లిథియం, కోబాల్ట్, నికెల్ వంటి విలువైన లోహాలను  వెలికితీయడానికి కంపెనీలకు సహాయం చేయడానికి గనుల మంత్రిత్వ శాఖ రూ.1,500 కోట్ల కొత్త ప్రోత్సాహక పథకాన్ని మొదలుపెట్టింది. దీని వల్ల దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుందని, భారతదేశంలో రీసైక్లింగ్ విధానం వ్యవస్థీకృతం అవుతుందని భావిస్తున్నారు.

గనుల మంత్రిత్వ శాఖ  ప్రకారం, ఈ కొత్త ప్రయత్నం నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్‌లో ఒక భాగం. దీనిని 3 సెప్టెంబర్  2025న కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. పరిశ్రమ వర్గాలతో మాట్లాడిన తర్వాత ఈ పథకం వివరాలు/గైడ్‌లైన్స్ 2 అక్టోబర్ 2025న విడుదలయ్యాయి. దరఖాస్తు ప్రక్రియ అదే రోజు మొదలైంది ఇంకా ఇప్పటికే రీసైక్లింగ్ చేసే కంపెనీలు, టెక్నాలజీ కంపెనీల నుండి మంచి స్పందన వచ్చిందని మంత్రిత్వ శాఖ తెలిపింది.

భారతదేశంలో ఈ-వ్యర్థాల రీసైక్లింగ్: మన దేశంలో ప్రస్తుతం ప్రతి ఏడాది దాదాపు 17 లక్షల టన్నుల ఎలక్ట్రానిక్ వ్యర్థాలను, దాదాపు 60 కిలోటన్నుల వాడిన లిథియం-అయాన్ బ్యాటరీలను (LIBలు) ఉత్పత్తి  చేస్తుంది. 2025–26 కేంద్ర బడ్జెట్‌లో దిగుమతి చేసుకున్న పాత LIB స్క్రాప్‌పై కస్టమ్స్ సుంకాలను తీసివేయడంతో, రాబోయే నాలుగు నుంచి ఐదు ఏళ్లలో రీసైక్లింగ్ అవకాశాలు చాలా పెరుగుతాయని ప్రభుత్వం ఆశిస్తోంది.

కొత్త విధానం ప్రకారం, రీసైకిల్ చేయడానికి పనికి వచ్చే వాటిలో  ఇ-వ్యర్థాలు, వాడిన LIBలు, పాత వాహనాల నుండి వచ్చిన ఉత్ప్రేరక కన్వర్టర్లు ఉంటాయి. ఈ పథకం విలువైన లోహాలున్న పొడి పదార్థాన్ని "నల్ల ద్రవ్యరాశి" (బ్లాక్ మాస్) ని విదేశాలకు పంపకుండా, దేశంలోనే నిజమైన ఖనిజాలను  వెలికితీసే కంపెనీలకు ప్రోత్సాహకాలు ఇస్తుంది. ఎందుకంటే, మన దేశంలో ప్రాసెసింగ్ సౌకర్యాలు తక్కువగా ఉండటం వలన ఇప్పటివరకు దీన్ని  ఎక్కువగా విదేశాలకు పంపేవారు.

కంపెనీలు ఎలక్ట్రానిక్ & బ్యాటరీ వ్యర్థాలను సేకరించి, రీసైకిల్ చేయాలనే ఎక్స్‌టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ (EPR) విధానం ద్వారా ముడిసరుకు సేకరణ మరింత బలంగా మారుతుంది. ఈ ప్రోత్సాహక పథకం వల్ల అనధికారికంగా విడదీసే వాళ్ళు, ముక్కలు చేసే వాళ్ళు కూడా అధికారిక రీసైక్లింగ్ నెట్‌వర్క్‌లో చేరడానికి అవకాశం దొరుకుతుంది. దీని ద్వారా హై-వాల్యూ ఖనిజాలను తిరిగి పొందగలిగే భారతదేశ సామర్థ్యం పెరుగుతుంది.

►ALSO READ | Smart Fabric: ఇప్పుడు మీ షర్ట్, ప్యాంటు మీ గొంతు వింటాయి ! శాస్త్రవేత్తల అద్భుతమైన సృష్టి..

ఈ పథకంలో చేరడానికి పెద్ద రీసైక్లర్లకు గరిష్టంగా 50 కోట్లు, చిన్న సంస్థలకు గరిష్టంగా 25 కోట్లు ప్రోత్సాహకాలుగా పరిమితి విధించింది మంత్రిత్వ శాఖ. ఈ కార్యక్రమంలో హైడ్రోమెటలర్జీ వంటి రీసైక్లింగ్ పద్ధతులను అమలు చేయడాన్ని ప్రోత్సహిస్తుంది.

IITలు, CSIR ప్రయోగశాలలు వంటి పరిశోధనా సంస్థలు ఇప్పటికే లోహాలను తిరిగి పొందడానికి, శుద్ధి చేయడానికి దేశీయ పద్ధతులను అభివృద్ధి చేశాయి. ఈ సంస్థలు, ఖనిజాల ప్రాసెసింగ్‌లో శిక్షణ ఇవ్వడానికి ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాయి.  
 
కీలకమైన ఖనిజాలు ఎలక్ట్రిక్ వాహనాలు, పునరుత్పాదక ఇంధన వ్యవస్థలు, అధునాతన ఎలక్ట్రానిక్స్‌కు చాలా ముఖ్యం. దేశంలో రీసైక్లింగ్‌ను పెంచడం ద్వారా, పర్యావరణ లక్ష్యాలను చేరుకుంటూనే, విదేశాల నుండి ఖనిజాల దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది.