
శివ్వంపేట, వెలుగు: శివ్వంపేట మండలం కొంతన్ పల్లి గ్రామ శివారులో ఏర్పాటైన వృంధా వ్యాలీ ఫామ్ ల్యాండ్ వెంచర్ నిర్వాహకులు దాదాపు నాలుగు ఎకరాలు ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసినట్టు ఫిర్యాదులు రావడంతో సోమవారం తహసీల్దార్ కమలాద్రి, ఆర్ఐ కిషన్, సర్వేయర్ అరుణ్ కుమార్ సిబ్బందితో కలిసి సర్వే చేసేందుకు వెళ్లారు. ఈ సందర్భంగా వెంచర్ సిబ్బంది ట్రాక్టర్ అడ్డుపెట్టి అధికారులను అడ్డుకున్నారు. తహసీల్దార్ తో వాగ్వాదానికి దిగారు. దీంతో ట్రాక్టర్ ను సీజ్ చేసి కేసు నమోదు చేయాలని సిబ్బందిని తహసీల్దార్ కమలాద్రి ఆదేశించారు.
అనంతరం సర్వే చేసి రోడ్డును, ప్రభుత్వ భూమిలో ఏర్పాటు చేసిన గేటును, కాంపౌండ్ వాల్ ను తొలగించారు. అనంతరం నాలుగు ఎకరాలు ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామ రైతులు మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కుంటలకు, వ్యవసాయ పొలాలకు వెళ్లే ప్రభుత్వ దారిని కబ్జా చేసి వృందా వ్యాలీ వెంచర్ ఏర్పాటు చేశారని ఆరోపించారు.
అప్పట్లో అధికారులకు స్థానిక ఎమ్మెల్యేకు, మంత్రికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. అప్పటి తహసీల్దార్కు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా, తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన చేసినాఫలితం లేకుండా పోయిందన్నారు. కొంతాన్పల్లి మాజీ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కరుణాకర్ రెడ్డి, గ్రామస్తులు శంకర్, శివ, దేవలింగం, శేఖర్, మహేశ్, వెంకటేశ్, రాజు, అనిల్, నర్సింలు ఉన్నారు.