అమ్మకానికి సర్కారు భూములు, ఆస్తులు

అమ్మకానికి సర్కారు భూములు, ఆస్తులు
  • టార్గెట్ 50 వేల కోట్లు
  • ఇప్పటికే గ్రీన్​సిగ్నల్​ ఇచ్చిన రాష్ట్ర కేబినెట్
  • భూముల విలువ, వివరాల సేకరణలో సీఎస్​
  • రెవెన్యూ, హౌసింగ్, హెచ్ఎండీఏ ఆఫీసర్లతో త్వరలోనే మీటింగ్​లు
  • డిసెంబర్​ వరకు అమ్మకాలు పూర్తయ్యే చాన్స్​

హైదరాబాద్, వెలుగు: ఒకవైపు అప్పుల మీద అప్పులు చేస్తూనే, మరోవైపు ఉన్న భూములు, ఆస్తులు అమ్మేసేందుకు రాష్ట్ర సర్కారు రెడీ అయింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు, ప్రభుత్వ ఆస్తులు ఉన్నాయి? వాటిని ఎలా అమ్మాలి? అనే దానిపై ఫోకస్​ పెట్టింది. వీటి సేల్స్​ ద్వారా రూ. 50 వేల కోట్లు రాబట్టుకోవాలని చూస్తోంది. అమ్మకానికి సంబంధించి వెంటనే చర్యలు ప్రారంభించాలని సీఎస్​ సోమేశ్​కుమార్​ను ఆదివారం జరిగిన కేబినెట్  భేటీలో ఆదేశించింది. ఏదేమైనా ఈ ఏడాది అమ్మితీరాలని, లేకపోతే ప్రభుత్వ ఖజానాకు దెబ్బపడుతుందని సీఎం కేసీఆర్​ తేల్చిచెప్పినట్లు ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి.  అందులో భాగంగా.. భూములు, ఆస్తుల వివరాలు, వాటిని అమ్మితే వచ్చే రాబడిపై  లెక్కలు తీసేందుకు రెవెన్యూ, హౌసింగ్, హెచ్ఎండీఏ ఆఫీసర్లతో త్వరలో సీఎస్​ సమావేశాలు నిర్వహించనున్నారు. అంతా అనుకున్నట్టు జరిగితే ఈ ఏడాది డిసెంబర్ నాటికి అమ్మకాలు  పూర్తయ్యే చాన్స్ ఉందని ఆఫీసర్లు అంటున్నారు. 2021–-22 బడ్జెట్​లోనే ప్రభుత్వ భూములు, ఆస్తులు అమ్ముతామని ప్రభుత్వం ప్రకటించింది.  అంతకంటే ముందు ఆర్థిక మంత్రి హరీశ్ రావు నేతృత్వంలోని ఆర్థిక వనరుల సమీకరణ కేబినెట్ సబ్ కమిటీ అదనపు ఆదాయ మార్గాలపై అన్వేషించి.. ఆమ్దానీ పెంచుకోవాలంటే ప్రభుత్వ ఆస్తుల అమ్మకం తప్పనిసరని సిఫార్సు చేసింది. 

హౌసింగ్ బోర్డు భూములతో రూ. 35 వేల కోట్లు!
హౌసింగ్ బోర్డుకు రాష్ట్రవ్యాప్తంగా వందలాది ఎకరాలు భూములు ఉన్నాయి. ఈ భూములకు గతంలో పెద్దగా డిమాండ్ లేదు. కానీ కొత్త  జిల్లాల ఏర్పాటు తర్వాత మంచి గిరాకీ ఏర్పడింది. దీంతో ఆ భూములను అమ్మకానికి పెట్టేందుకు ప్రభుత్వం రెడీ అయింది. ఇప్పటికే హౌసింగ్ శాఖకు చెందిన ఆఫీసర్లు ఎక్కడెక్కడ భూములు ఉన్నాయో లెక్కలు తీశారు.రాష్ట్రవ్యాప్తంగా హౌసింగ్​ బోర్డు పరిధిలో దాదాపు 871 ఎకరాల భూములు ఉన్నాయి. వీటిని అమ్మితే  సుమారు రూ. 35 వేల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేశారు. ఇందులో హైదరాబాద్, రంగారెడ్డి పరిధిలోనే 638 ఎకరాల భూములు  ఉండగా.. వీటిని అమ్మితేనే  తక్కువలో  తక్కువ రూ. 30 వేల కోట్ల వరకు ఆమ్దానీ వస్తుందని ఆఫీసర్లు చెప్తున్నారు. మిగతా రూ. 5 కోట్లు జిల్లాల్లోని భూముల ద్వారా వస్తుందని లెక్క గడుతున్నారు. 

రాజీవ్ స్వగృహ ఫ్లాట్లు వేలం 
రాజీవ్ స్వగృహ కల్ప కింద రాష్ట్ర వ్యాప్తంగా 3,600 ఫ్లాట్లు ఉన్నాయి. కొన్ని చోట్ల రిపేర్లు ఉంటే వాటిని ప్రభుత్వం చేయించింది. విడిగా ఒక్కో ఫ్లాట్​ను కాకుండా గంపగుత్తగా అమ్మాలని భావిస్తోంది. రాజీవ్​ స్వగృహ కల్ప  ఫ్లాట్ల ద్వారా ప్రభుత్వానికి మరో రూ. 2 వేల కోట్ల మేర  ఆదాయం వస్తుందని ఆఫీసర్లు అంచనా వేస్తున్నారు. 

హైదరాబాద్​ నలుదిశలా ఉన్న భూములతో రూ. 5 వేల కోట్లు!
కోకాపేటతోపాటు హైదరాబాద్​ సిటీ చుట్టుపక్కలా ఉన్న హెచ్​ఎండీఏ పరిధిలోని భూములను అమ్మాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. ఉప్పల్, ఘట్​కేసర్, హయత్ నగర్ సమీపంలో ల్యాండ్స్​ ఉన్నట్టు ఆఫీసర్లు చెప్తున్నారు. వీటిని అమ్మితే రూ. 5వేల కోట్ల దాకా వస్తుందని లెక్క గడుతున్నారు.

ప్లాట్లు చేసి అమ్ముడు..
హైదరాబాద్​ సిటీకి ఆనుకుని ఉన్న కోకాపేటలోని భూములకు మస్తు డిమాండ్ ఉంది. రాష్ట్ర ఏర్పాటు నుంచే ఈ భూములను అమ్మేందుకు ప్రభుత్వం ప్లాన్​ చేస్తోంది. అయితే ఆ భూములు తమవే అని కొందరు కోర్టుకువెళ్లడంతో ఆలస్యం జరిగింది. ఆ భూములు ప్రభుత్వానివేనని నిరుడు కోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో వెంటనే  వాటిని అమ్మేందుకు సర్కారు ప్రయత్నించినా.. అప్పట్లో కరోనా, లాక్ డౌన్​తో బ్రేకులు పడ్డాయి. కానీ ఈ ఏడాది ఎట్లయినా సరే  అమ్మితీరాలని భావిస్తోంది.  కోకాపేటలో 150 ఎకరాలలో లే అవుట్​ రెడీగా ఉన్నట్టు ఆఫీసర్లు  చెప్తున్నారు. ఐటీ కారిడార్ దగ్గరగా ఉండటంతో హాట్ కేకుల్లా ప్లాట్లు సేల్​ అవుతాయని అంచనా వేస్తున్నారు. కోకాపేట భూములతో కనీసం రూ. 10 వేల కోట్ల ఆదాయం వస్తుందని ప్రభుత్వం ధీమాగా ఉంది.

హౌసింగ్ బోర్డు భూములు: హౌసింగ్ బోర్డుకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 871 ఎకరాల భూములు ఉన్నయ్​. వీటిని అమ్మేస్తే  సుమారు రూ. 35 వేల కోట్లు వస్తాయని అంచనా.
కోకాపేట ల్యాండ్స్​: హైదరాబాద్​ శివారులోని కోకాపేటలో 150 ఎకరాల భూములు ఉన్నయ్.​ వీటిని ప్లాట్లుగా మార్చి అమ్మితే రూ. 10 వేల కోట్ల దాకా వస్తాయని అంచనా.
హైదరాబాద్​ చుట్టుపక్కల భూములు: హైదరాబాద్​ సిటీ చుట్టుపక్కల ఉప్పల్, ఘట్​కేసర్, హయత్ నగర్ సమీపంలో ల్యాండ్స్​ ఉన్నయ్​. వీటిని అమ్మేస్తే రూ. 5 వేల కోట్లు వస్తాయని అంచనా.
రాజీవ్ స్వగృహ ఫ్లాట్లు: రాజీవ్ స్వగృహ కల్ప కింద రాష్ట్ర వ్యాప్తంగా 3,600 ఫ్లాట్లు ఉన్నయ్​. విడిగా ఒక్కో ఫ్లాట్​ను కాకుండా గంపగుత్తగా అమ్మితే రూ. 2 వేల కోట్లు వస్తాయని అంచనా.