పేద, మధ్యతరగతి జనానికి తక్కువ ధరకే ఏసీ రైలు ప్రయాణాన్ని అందించిన గరీబ్ రథ్ రైళ్లు పట్టాలకు దూరం కానున్నాయి. ఏసీ కోచ్ లలో ప్రయాణించాలంటే ఇకపై పేదలూ ఎక్కువ ధర చెల్లించాల్సి రానుంది. ఇన్నిరోజులూ గరీబ్ రథ్ట్రెయిన్లో తక్కువ డబ్బు చెల్లించి ఏసీ బోగీల్లో ప్రయాణించిన పేద ప్రజలకు ఇది చేదువార్తే. ఇకపై వాళ్లు ఏసీ రైలు ప్రయాణం చేయాలంటే జేబుకు చిల్లు పెట్టుకోక తప్పదు. ఎందుకంటే.. గరీబ్రథ్ట్రెయిన్లను ఆపేయాలని రైల్వే శాఖ యోచిస్తున్నట్లు సమాచారం. వాటి స్థానంలో ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. కొత్తగా గరీబ్ రథ్ ట్రెయిన్ కోచ్లను తయారు చేయొద్దని రైల్వే శాఖ ఇప్పటికే నిర్ణయించింది. ఉన్నవాటిని కూడా దశలవారీగా పక్కన పెట్టేసి, వాటి స్థానంలో ఎక్స్ప్రెస్ ట్రెయిన్లను నడపాలని యోచిస్తోంది.
ఆర్థిక భారం తగ్గించుకునేందుకే?
గరీబ్ రథ్ రైళ్లను మధ్యతరగతి, అల్పాదాయ వర్గాల ప్రజల కోసం 2006లో అప్పటి రైల్వే శాఖ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ప్రారంభించారు. పేద కుటుంబాలకూ ఏసీ ట్రెయిన్ ప్రయాణాన్ని అందుబాటులోకి తేవడమే వీటి ప్రధాన ఉద్దేశం. అయితే, ఇది మంచి ఆలోచన కాదని, పేద ప్రజలకు చాలా ప్రయోజనకరంగా ఉన్న ఈ రైళ్లను నిలిపివేసే యోచనను విరమించుకోవాలని పలువురు నాయకులు, సామాజిక వేత్తలు, సోషల్ మీడియాలోనూ అనేక మంది నెటిజన్లు కేంద్రం ఆలోచనపై ఫైర్ అవుతున్నారు. గరీబ్ రథ్ ట్రెయిన్లు పది, పద్నాలుగేళ్ల కింద తయారు చేసినవి. వీటికి ఇప్పుడు మెయింటెనెన్స్ ఖర్చు చాలా ఎక్కువ అవుతోందని, ఆ భారం మోయలేకే ఈ రైళ్లను పక్కన పెట్టాలన్నది రైల్వే ఆలోచనగా చెబుతున్నారు. గరీబ్రథ్ ట్రెయిన్ ప్రయాణికులు భోజనం, దుప్పట్లకు అదనంగా డబ్బు కూడా చెల్లించాల్సి ఉంటుందని చెబుతున్నారు. ప్రస్తుతం, ఏసీ ట్రెయిన్స్ టికెట్ ధరలతో పోలిస్తే గరీబ్ రథ్ ట్రెయిన్స్టికెట్ ధరలు చాలా తక్కువ. ఒక రూట్లో ఏసీ త్రీటైర్ టికెట్ రూ. 1300 ఉంటే.. అదే దూరానికి గరీబ్రథ్ట్రెయిన్లో టికెట్ ధర రూ.900 మాత్రమే ఉంది.