- వైరస్ కట్టడిలో ప్రభుత్వం పట్టు తప్పినట్టు అనిపిస్తోంది: హైకోర్టు
- డాక్టర్లకే కరోనా వచ్చిందంటే పరిస్థితి ఏంది?
- 400 మంది మెడికల్ స్టాఫ్, 72 మంది డాక్టర్లు క్వారంటైన్లో ఉన్నారు
- డాక్టర్లకు సరిపడా పీపీఈ కిట్లు ఇచ్చారా లేదా?
- కరోనా ట్రీట్మెంట్ ను ఆరోగ్యశ్రీలో ఎందుకు చేర్చడం లేదని ప్రశ్న
గాంధీ హాస్పిటల్లోని పరిస్థితులపై హైకోర్టు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. హెల్త్ డైరెక్టర్, కోఠి హాస్పిటల్ సూపరి టెండెంట్లు క్వారంటైన్లో ఉన్నారంటే.. 400 మంది మెడికల్ స్టాఫ్, 72 మంది డాక్టర్లకు కరోనా వచ్చిందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చని వ్యాఖ్యానించింది. కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసిందా అని ప్రశ్నించింది. ‘‘ప్రభుత్వం పట్టు తప్పినట్లుగా అనిపిస్తోంది. చివరికి డాక్టర్లపై దాడులు జరిగే పరిస్థితులు వచ్చాయి’’ అని ఘాటుగా వ్యాఖ్యానించింది. డాక్టర్లపై దాడులు జరగకుండా చర్యలు తీసుకోవాలని గతంలోనే ఉత్తర్వులు ఇచ్చినా పాలకులు పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ ఆదేశాల్నిఅమలు చేయక పోవడం కోర్టుధిక్కారం అవుతుందనే విషయం ప్రభుత్వానికి తెలియదా అని హైకోర్టుప్రశ్నించింది. కరోనా కట్టడి కోసం ఏం చర్యలు తీసు కుంటున్నారో తెలియజేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. గాంధీ, నిమ్స్, కింగ్ కోఠి, ఫీవర్, చెస్ట్ హాస్పిటళ్లలో డాక్టర్లు, మెడికల్ స్టాఫ్కు పీపీఈ కిట్లు, రక్షణ పరికరాలు ఏవిధంగా ఇస్తున్నారో తెలియజేయాలని సూచించింది. గాంధీ హాస్పిటల్లో పరిస్థితిపై గురువారం స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలని గాంధీ హాస్పిటల్ సూపరింటెండ్ ను, వైద్య శాఖ డైరెక్ట ర్ను కూడా ఆదేశించింది. సరిపోయేన్ని పీపీఈ కిట్లు, మాస్కులు డాక్టర్లకు పంపిణీ చేసేలా ఉత్తర్వులివ్వాలని కోరుతూ అడ్వకేట్ ఆర్. షమీర్ అహ్మద్ దాఖలు చేసిన పిల్ ను బుధవారం చీఫ్ జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయ్సేన్ రెడ్డి డివిజన్ బెంచ్ విచారించింది. కరోనా నివారణకు తీసుకున్న చర్యల గురించి ఒక్క ఆస్పత్రి సూపరింటెండెంట్ కూడా కౌంటర్ దాఖలు చేయయపోవడాన్ని బెంచ్ తప్పుబట్టింది.
ఆరోగ్యశ్రీలో ఎందుకు చేర్చడం లేదు?
కరోనా ట్రీట్మెంట్ ను ఆరోగ్యశ్రీలో ఎందుకు చేర్చడం లేదని ప్రభుత్వాన్ని హైకోర్టుప్రశ్నించింది. రోజుకు 200 కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయని, వైరస్ కట్టడికి యుద్ధప్రాతిపదికపై చర్యలు తీసుకోవాలని సూచించింది. హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు మాత్రం ఏడు లక్షల పీపీఈ కిట్లు అందుబాటులో ఉన్నాయని చెబుతున్నారే గానీ వాటిని డాక్టర్లకు, మెడికల్ స్టాఫ్కు ఇచ్చారో లేదో చెప్పడం లేదని హైకోర్టు మండిపడింది. 72 మంది డాక్టర్లు, 400 మంది మెడికల్ స్టాఫ్ కరోనా బారిన పడ్డారంటే పీపీఈ కిట్లుతగినన్ని ఇవ్వకపోవడంతోనే వారికి వైరస్ అంటి ఉండొచ్చనిపిస్తోందని అభిప్రాయపడింది. దీన్ని బట్టి గాంధీ హాస్పిటల్లో పరిస్థితులు దయనీయంగా ఉన్నాయనిపిస్తోందని బెంచ్ ఆందోళన వ్యక్తం చేసింది. ‘‘హాస్పిటళ్ల పరిస్థితుల వల్ల మెడికల్ స్టాఫ్ కు పాజిటివ్ రాలేదని, వాళ్లు హాస్టళ్ళలో ఉంటూ బయటకు వెళడ్లం వల్ల వచ్చిందని ప్రభుత్వంచెబుతోంది. ఇదే నిజమైతే అలా వెళ్లిన వారి విషయంలో ఎందుకు జాగ్రత్త లు తీసుకోలేదు?” అని ప్రశ్నించింది. ఇప్పటికే అన్నిజిల్లాల్లోనూ కరోనాకేసులు ఉంటే.. ఆయా జిల్లాల కేంద్రాల్లో కరోనా ట్రీట్ మెంట్ కోసం ఆస్పత్రులను ఏర్పాటు చేయాలని హైకోర్టు చెప్పింది. విచారణను గురువారానికి వాయిదా వేసింది.