డెడ్బాడీని కుక్క పీకిన ఘటనపై.. సర్కార్ సీరియస్

డెడ్బాడీని కుక్క పీకిన ఘటనపై.. సర్కార్ సీరియస్
  • సూపరింటెండెంట్​ సహా, ఆర్​ఎంవో, డ్యూటీ డాక్టర్, ఎంఎన్ఓ సస్పెన్షన్
  • విచారణకు సర్కారు ఆదేశాలు, ఆసుపత్రిని విజిట్ చేసిన వైద్య విధాన పరిషత్  కమిషనర్

జడ్చర్ల/జడ్చర్ల టౌన్​, వెలుగు: మహబూబ్​నగర్​ జిల్లా జడ్చర్లలోని పాత ఏరియా హాస్పిటల్​లో సోమవారం మార్చురీలో డెడ్​బాడీని కుక్క పీకుతున్న ఘటనను రాష్ట్ర ప్రభుత్వం సీరియస్​గా తీసుకుంది. దీనిపై విచారణకు ఆదేశించగా, వైద్య విధాన పరిషత్​ కమిషనర్ ​అజయ్​ కుమార్​ మంగళవారం ఉదయం హాస్పిటల్​ను విజిట్​ చేశారు. విచారణలో సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని గుర్తించారు.

హాస్పిటల్​ సూపరింటెండెంట్​తో పాటు ఆర్ఎంవో హరినాథ్, డ్యూటీ డాక్టర్​ మనీషా, డీఎన్ వో రవి ప్రకాశ్​ను సస్పెండ్  చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఆసుపత్రి నిర్వహణలో సూపరింటెండెంట్​ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. వంద పడకల హాస్పిటల్​లో మార్చురీ గదిని కాంట్రాక్టర్  అప్పగించారని తెలిపారు. కానీ, దానిని వినియోగంలోకి తీసుకురాలేదన్నారు. పాత ఏరియా హాస్పిటల్​లో పోస్టుమార్టం నిర్వహించడం వల్లే ఈ ఘటన చోటు చేసుకుందన్నారు.

ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేస్తామని, ఇలాంటివి పునరావృతం కాకుండా చూస్తామని చెప్పారు. ఈ ఘటనపై జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి సీరియస్  అయ్యారు. వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకువస్తే, చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. 

సస్పెన్షన్​ను రద్దు చేయాలి

హైదరాబాద్ : జడ్చర్ల ఘటనలో వైద్యుల సస్పెన్షన్‌‌ను తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం(టీజీజీడీఏ) అధ్యక్షుడు నరహరి, సెక్రటరీ జనరల్ లాలుప్రసాద్ రాథోడ్, ట్రెజరర్​రవూఫ్​మంగళవారం ఒక ప్రకటనలో ఖండించారు. డాక్టర్ల సస్పెన్షన్ ను రద్దు చేయాలని డిమాండ్​చేశారు. ప్రభుత్వ విధివిధానాల ప్రకారం.. పోస్టుమార్టం నిర్వహించడం మాత్రమే వైద్యుల పని అని, మార్చురీ నిర్వహణ, భద్రత పర్యవేక్షణ తమ బాధ్యత కాదన్నారు.