వేములవాడ, వెలుగు: వేములవాడ మున్సిపాలిటీపై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. ఆదివారం పట్టణంలోని మహాలక్ష్మీ కాలనీ 4, 5 వార్డుల పరిధిలో రూ.45 లక్షలతో సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే కొత్త ఇందిరమ్మ ఇల్లు గృహ ప్రవేశంలో పాల్గొన్నారు. ఈ సంర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో వేములవాడ అభివృద్ధిని పట్టించుకోలేదని విమర్శించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉందని సర్పంచ్ ఎన్నికల్లో పార్టీ బలపరిచిన అభ్యర్థులకు పట్టం కట్టినట్లుగా మున్సిపాలిటీలోనూ అధికార పార్టీకి అవకాశం ఇవ్వాలన్నారు. తిప్పాపూర్ మూడో బ్రిడ్జి నిర్మాణం పనులు, కోరుట్ల బస్టాండ్ నుంచి చెక్కపల్లి బస్టాండ్ వరకు రోడ్డు నిర్మాణం పనులు వేగవంతంగా సాగుతున్నాయి తెలిపారు.
వేములవాడ ఆధ్యాత్మికంగానే కాకుండా పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ఆలోచిస్తోందని, త్వరలో గుడిచెరువులో బోటింగ్ సౌకర్యం కల్పించనున్నట్లు ఆది శ్రీనివాస్ తెలిపారు. అలాగే నాంపల్లి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి ప్రత్యేక ఆకర్షణగా ఎయిర్క్రాఫ్ట్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్కమిషనర్ అన్వేష్, చంద్రగిరి శ్రీనివాస్గౌడ్, కనికరపు రాకేశ్, తోట రాజు, బింగి మహేశ్, పుల్కం రాజు, కొమురయ్య పాల్గొన్నారు.
దుబ్బ రాజన్న జాతర పోస్టర్ ఆవిష్కరణ
వేములవాడ రూరల్/కోనరావుపేట: వేములవాడ రూరల్ మండలం నాగయ్యపల్లి గ్రామంలో కొలువై ఉన్న దుబ్బ రాజేశ్వరస్వామి ఆలయంలో ఈ నెల 17, 18 తేదీల్లో నిర్వహించనున్న జాతర పోస్టర్ను విప్ ఆది శ్రీనివాస్ ఆవిష్కరించారు. అంతకుముందు కోనరావుపేట మండలం ధర్మారం గ్రామానికి చెందిన చిన్నారి శ్రీరాముల రిషికకు అత్యవసర చికిత్స కోసం రూ.5 లక్షల ఎల్ఓసీని మంజూరు చేయించారు.
