
హైదరాబాద్, వెలుగు:మనుషులకు, వాహనాలకే కాదు ఖాళీ భూములకు కూడా ఇన్సూరెన్స్ను అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. యాజమాన్యం విషయంలో వివాదం తలెత్తితే కొనుగోలుదారు నష్టపోకుండా బీమా పరిహారం ఇచ్చేలా కృషి చేస్తున్నది. కొత్త రెవెన్యూ చట్టంలో ప్రధానాంశమైన టైటిల్ గ్యారెంటీలో భూముల ఇన్సూరెన్స్కు చోటు కల్పించనున్నట్లు తెలిసింది. రెవెన్యూ శాఖలో సమూల మార్పులకు ప్రయత్నిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్లో భూ వివాదాలకు తావులేకుండా కంక్లూజివ్ టైటిల్స్ జారీ చేయాలని భావిస్తున్నది. ఇప్పటివరకు మన రాష్ట్రంలో రికార్డ్స్ ఆఫ్ రైట్స్(ఆర్వోఆర్), రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ చట్టాల ప్రకారం భూ లావాదేవీలు జరుగుతున్నాయి. ఈ చట్టాల్లో ఉన్న లొసుగుల కారణంగా అనేక అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. డబుల్ రిజిస్ట్రేషన్లు కూడా జరిగిపోతున్నాయి. దీంతో ఒకే భూమిపై ఓనర్షిప్ రైట్స్ కలిగిన కాగితాలు ఇద్దరి దగ్గర ఉండటంతో నిజమైన యజమాని ఎవరో తేల్చడం కూడా తలనొప్పిగా మారుతోంది. అందుకే ఇక మీదట భూములపై వివాదాలేవి లేవని నిర్ధారించుకున్నాకే నిజమైన యజమానికే టైటిల్ గ్యారెంటీని జారీ చేయనున్నారు. అయినా ఆ తర్వాత కాలంలో ఏదైనా వివాదం తలెత్తి కొనుగోలుదారు టైటిల్ కోల్పోవాల్సి వస్తే అందుకు ప్రభుత్వమే బాధ్యత తీసుకోనుంది. అందుకోసం భూములకు ఇన్సూరెన్స్ చేయాలని ఆలోచిస్తున్నది. అయితే ఈ పనిని ప్రత్యేక విభాగం ద్వారా ప్రభుత్వమే చేయాలా లేదా ఏదైనా ఇన్సూరెన్స్ కంపెనీకి అప్పగించాలా అనే విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ రాలేదని తెలిసింది.