విద్యను పట్టించుకోని ప్రభుత్వాలు

విద్యను పట్టించుకోని ప్రభుత్వాలు

విద్యపట్ల పెట్టుబడిదారీవర్గ దృక్పథం మారుతుందా? ప్రభుత్వ వ్యవస్థపై వ్యాపార రాజకీయాలు పట్టు సాధించి ఉదార విద్యను కనుమరుగు చేస్తున్నాయా? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హార్వర్డ్ యూనివర్సిటీపై చేస్తున్న దాడిని చూస్తే అవును అనిపిస్తుంది. ట్రంప్​ వైఖరి మేధావులను విస్మయానికి గురిచేస్తోంది.  ప్రభుత్వ గ్రాంట్స్ తొలగించడంతో విద్యను వ్యాపారం వైపు నెట్టడం జరుగుతుంది. దాంతో రీసెర్చ్ అండ్​ డెవలప్​మెంట్ కుంటుపడే ప్రమాదం ఉంది. 

ప్ర ధాని మోదీ నాయకత్వంలో ఆర్ఎస్ఎస్, - బీజేపీ.. విద్యావ్యవస్థపై పట్టు సాధించేందుకు  పలు ప్రయత్నాలు చేస్తున్నాయి.  గత పది సంవత్సరాలుగా విద్యను నియంత్రించే క్రమంలో కేంద్ర ప్రభుత్వం అభ్యుదయ భావజాలం కలిగిన జవహర్​లాల్ నెహ్రూ యూనివర్సిటీని  దెబ్బతీస్తూ వస్తోంది.  ఏ ప్రమాణాలు లేని సావర్కర్ వాదులను ప్రొఫెసర్ వ్యవస్థలో నియమించడం జరుగుతోంది.  ప్రపంచస్థాయి ఆలోచనలను అందించాల్సిన యూనివర్సిటీ ఫ్రొఫెసర్లు హిందీ మాధ్యమం ద్వారా జేఎన్ టీయూను  ప్రాంతీయ స్థాయికి దిగజార్చడం దురదృష్టకరం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ నూతన విద్యా విధానం (NEP), మతతత్వ ఆలోచనలకు నాంది పలుకుతోంది. ఇది సమాజాన్ని వెనుకకు నడుపుతుంది.  సంప్రదాయ విద్యతో భారత్​ను ఎదిగిన, వెనుకబడిన (రెండు) సమాజాలుగా విభజిస్తుంది. 

అధిక ఫీజుల భారం

విద్యకు ప్రభుత్వం బడ్జెట్​ను  పెంచాల్సిందిపోయి సగానికి తగ్గించడంతో ఆర్ఎస్ఎస్, - బీజేపీలు  ప్రైవేట్ యూనివర్సిటీ వ్యవస్థలకు మార్గం సుగమం చేశాయి.  అధిక ఫీజుల భారంతో పేద, మధ్యతరగతి వర్గాలు ఉన్నత విద్యకు దూరం అవుతున్నాయి.  రాజ్యాంగ రిజర్వేషన్లను ప్రైవేటు సంస్థలలో అమలు చేయకపోవడంతో ఎస్సీ, ఎస్టీ,  బీసీ వర్గాలు యూనివర్సిటీ విద్యకు శాశ్వతంగా దూరం కావడం జరుగుతోంది.  దాంతో  వెనుకబడిన సమాజాలు అభివృద్ధికి, అవకాశాలకు, ఇంక్లూజివ్  ప్రజాస్వామ్యానికి  దూరం అవుతున్నాయి.  తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నుంచి పది సంవత్సరాలపాటు బీఆర్ఎస్ ప్రభుత్వం,, ఆర్ఎస్ఎస్, - బీజేపీ విధానాలను ప్రోత్సహించింది.  

చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన  ప్రపంచీకరణలో విద్య ప్రైవేటీకరణను మరింత బలోపేతం చేయడమే బీఆర్ఎస్ లక్ష్యంగా మారింది.  ప్రభుత్వ,  ప్రైవేట్ ఫ్రెండ్లీ విద్యతో  ఫీజులు విపరీతంగా పెంచడం జరుగుతోంది.  ఫీజులు కట్టలేక పేద, మధ్యతరగతి వర్గాలు నానా ఇబ్బందులు పడుతున్నారు. నాణ్యమైన విద్యకు దూరంగా బతకాల్సి వస్తోంది.  వెనుకబడిన వర్గాలకు అనుకూలంగా ఉండే ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసింది. విద్యలో దాదాపు మూడింట రెండు భాగాలు ప్రైవేట్ వ్యవస్థ అయితే, ప్రభుత్వ వ్యవస్థ ఒక భాగంగానే మిగిలింది.  ప్రభుత్వ విద్యకు దూరమవడం, నాణ్యమైన విద్యను అందుకోలేకపోవడంతో పేద వర్గాలు పోటీ ప్రపంచంలో నిలబడలేకపోతున్నారు. కాంట్రాక్టు, అవుట్ సోర్స్, సామాజిక భద్రత లేని ఉద్యోగాలకు పరిమితం అవుతున్నారు.

విద్యావ్యవస్థ బలహీనం

ప్రైవేట్ విద్యాసంస్థలు విపరీతంగా పెంచుతున్న ఫీజులను ప్రభుత్వం నియంత్రించలేకపోతోంది.  అధికారులు తమ బాధ్యత నిర్వర్తించకపోవడంతో విద్యావ్యవస్థను బలహీనపరుస్తున్నారు. రాష్ట్ర ఆవిర్భావం నుంచి  గత పది సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యా వ్యవస్థపై చర్చించలేదు.  ప్రాథమిక స్థాయి నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు విద్య ప్రభుత్వ నిరాదరణకు గురయింది.  ప్రభుత్వ ప్రచారాలు వాస్తవాలను తొక్కిపెడుతున్నాయి. పేదలు, దిగువ  మధ్యతరగతి వర్గాల పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా  మారింది.  ఈ కుటుంబాలు అప్పుల పాలవుతున్నాయి. పుస్తెలు తాకట్టు పెట్టి పిల్లలను చదివించే స్థితి ఏర్పడింది.  ఇది తెలంగాణకు అవమానకరం.

ప్రభుత్వ ప్రచారాలు,  వాస్తవ స్థితుల మధ్య సమతుల్యత ఉండాలి.  నూతన విద్యా సంవత్సరం మొదలు కాబోతుంది.  ప్రైవేట్ సంస్థలు రకరకాల ఫీజుల రూపంలో పిల్లల తల్లిదండ్రుల మీద విపరీతమైన భారాన్ని మోపుతున్నారు.  మాకేం పట్టింపు లేదు అనేవిధంగా  ప్రభుత్వం వ్యవహరించొద్దు.   ప్రభుత్వం అధికారులను అప్రమత్తం చేయాలి.  నిబంధనలను అతిక్రమించిన పాఠశాలలను హెచ్చరించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. 

కాంగ్రెస్ ప్రభుత్వం విద్యపై చర్చిస్తున్నప్పటికీ 7% బడ్జెట్​ మాత్రమే కేటాయించింది. రాష్ట్ర విద్యా కమిషన్ సూచించిన ఫీజు రెగ్యులేషన్​ను  ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. ప్రజా ప్రభుత్వం అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ వెంటనే ఫీజు రెగ్యులేషన్ కమిషన్ ద్వారా పాఠశాల, ఇంజినీరింగ్ కోర్సుల ఫీజులను నియంత్రించాలి.  లేకపోతే  ప్రభుత్వం బాధితుల ఆగ్రహానికి గురికాక తప్పదు. 

ప్రభుత్వ విద్యను నీరుగార్చిన బీఆర్ఎస్​

ప్రభుత్వ విద్యను నీరుగార్చేవిధంగా గత బీఆర్ఎస్​ ప్రభుత్వం ఉపాధ్యాయుల నియామకాలను 10 సంవత్సరాలుగా చేపట్టలేదు.  పాఠశాలల్లో మౌలిక వసతులు బలోపేతం చేయకపోవడంతో విద్యార్థులకు తరగతి గదులు లేని స్థితి నెలకొంది.  ఒకటే  గదిలో మూడు, నాలుగు, ఐదు క్లాసులను నిర్వహిస్తూ 'మల్టీ గ్రేడ్' విద్యతో తెలంగాణ సమాజాన్ని పాతాళానికి నెట్టింది.  తెలుగుతోపాటు ఇంగ్లీష్  విద్యను మాధ్యమంగా కోరుకుంటే నాణ్యత లేని విద్యతో తెలంగాణ బలహీనపడింది. 

 ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం విద్యా బడ్జెట్​ను  సగానికి తగ్గించగా..అదే దారిలో  కేసీఆర్ ప్రభుత్వం గత పదేళ్లలో బడ్జెట్​ను  తగ్గించింది.  తెలంగాణ విద్యా బడ్జెట్ 11% నుంచి 6%కు తీసుకువచ్చింది.  ప్రభుత్వ నిరాదరణతో విద్యార్థులు లేని బడులు దాదాపు 2000 లకు చేరుకున్నవి.  ఎన్నో బడులు మూతపడుతున్న స్థితి. ఇది తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను నిర్వీర్యం చేయటం కాదా? అభివృద్ధి, మార్పుకు మూలం విద్యనే.  విద్యను అమ్మకం వస్తువుగా మార్చడం దేశాన్ని వెనుకబాటుతనంలో ఉంచడమే.  ఇది జాతి విద్రోహ చర్య కాదా?  విచ్చలవిడిగా ప్రైవేట్ విద్యను ప్రోత్సహిస్తూ  ప్రభుత్వాలు తమ సంక్షేమ బాధ్యతల నుంచి తప్పించుకుంటున్నాయి. దాంతో వివిధ సామాజిక వర్గాలు తీవ్ర సంక్షోభంలోకి నెట్టబడుతున్నారు. రాజ్యాంగ న్యాయానికి దూరం అవుతున్నారు.

-ప్రొ.  సింహాద్రి సోమనబోయిన,అధ్యక్షుడు, సమాజ్​వాది పార్టీ, తెలంగాణ-