- రెండేండ్ల తర్వాత ఓయూ కాన్వొకేషన్
- అవకాశాలు అందిపుచ్చుకోవాలె: గవర్నర్ తమిళి సై
హైదరాబాద్, వెలుగు: సవాళ్లను ఎదుర్కొంటూ అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ స్టూడెంట్స్ ఉన్నతంగా రాణించాలని రాష్ర్ట గవర్నర్తమిళిసై సూచించారు. అబ్దుల్ కలామ్ చెప్పినట్లు ప్రతి ఒక్కరూ కలల సాకారం కోసం శ్రమించాలన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ 81వ కాన్వొకేషన్ వేడుకలు బుధవారం ఓయూ ఠాగూర్ ఆడిటోరియంలో జరిగాయి. ఈ కార్యక్రమానికి చాన్స్ లర్ హోదాలో గవర్నర్ తమిళి సై, విశిష్ట అతిథిగా డీఆర్డీవో చైర్మన్ సతీశ్ రెడ్డి హాజరయ్యారు . దేశం అన్ని రంగాల్లో పురోభివృద్ధి సాధించేందుకు నూతన ఆవిష్కరణలు కీలకమని, స్టూడెంట్స్వాటిపై దృష్టి పెట్టాలని గవర్నర్ అన్నారు.
లోతైన పరిశోధనలు జరగాలి: సతీశ్ రెడ్డి
యూనివర్సిటీల్లో లోతైన పరిశోధనలు జరగాలని, అందుకు స్టూడెంట్స్ను సంసిద్దులను చేయాల్సిన బాధ్యత లెక్చరర్లపై ఉందని డీఆర్ డీవో చైర్మన్ సతీశ్ రెడ్డి అన్నారు. ఎవరో తయారు చేసిన వాటని వాడటం కాదు, అందుబాటులో ఉన్న టెక్నాలజీని ఉపయోగించి నాణ్యమైన వస్తువులను తక్కువ ఖర్చుతో తయారు చేసి అందుబాటులోకి తీసుకురావాలన్నారు.
80 మందికి గోల్డ్మెడల్స్
వర్సిటీ నివేదికను ఓయూ వీసీ రవీందర్యాదవ్ చదివి వినిపించారు. 2018 జులై నుంచి 2020 మధ్యకాలంలో వివిధ గ్రూప్ లలో మాస్టర్స్, పీహెచ్డీ పూర్తి చేసిన స్టూడెంట్స్కు కాన్వొకేషన్ సందర్భంగా పట్టాలు, మెడల్స్ ప్రదానం చేశారు. 350 మంది పట్టాలు, 80 మంది గోల్డ్ మెడల్స్ పొందారు. గోల్డ్ మెడల్ గ్రహీతల్లో అమ్మాయిలే 68 మంది ఉండటం విశేషం. ఎంఎస్సీ ఆర్గానిక్ కెమెస్ట్రీలో 81 పర్సెంటేజ్ స్కోర్సాధించి మొదటి స్థానంలో నిలిచిన సుశాంత్ అనే స్టూడెంట్ ఏకంగా 5 గోల్డ్ మెడల్స్ సాధించాడు.