అవకాశాలు అందిపుచ్చుకోవాలె

అవకాశాలు అందిపుచ్చుకోవాలె
  • రెండేండ్ల తర్వాత ఓయూ కాన్వొకేషన్​
  • అవకాశాలు అందిపుచ్చుకోవాలె: గవర్నర్​ తమిళి సై

హైదరాబాద్, వెలుగు: సవాళ్లను ఎదుర్కొంటూ అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ స్టూడెంట్స్ ​ఉన్నతంగా రాణించాలని రాష్ర్ట గవర్నర్​తమిళిసై సూచించారు. అబ్దుల్ కలామ్​ చెప్పినట్లు ప్రతి ఒక్కరూ కలల సాకారం కోసం శ్రమించాలన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ 81వ కాన్వొకేషన్​ వేడుకలు బుధవారం ఓయూ ఠాగూర్ ​ఆడిటోరియంలో జరిగాయి. ఈ కార్యక్రమానికి చాన్స్ లర్​ హోదాలో  గవర్నర్​ తమిళి సై, విశిష్ట అతిథిగా డీఆర్​డీవో చైర్మన్​ సతీశ్ ​రెడ్డి హాజరయ్యారు . దేశం అన్ని రంగాల్లో పురోభివృద్ధి సాధించేందుకు నూతన ఆవిష్కరణలు కీలకమని, స్టూడెంట్స్​వాటిపై దృష్టి పెట్టాలని గవర్నర్ అన్నారు.

లోతైన పరిశోధనలు జరగాలి: సతీశ్ రెడ్డి

యూనివర్సిటీల్లో లోతైన పరిశోధనలు జరగాలని, అందుకు స్టూడెంట్స్​ను సంసిద్దులను చేయాల్సిన బాధ్యత లెక్చరర్లపై ఉందని డీఆర్ డీవో చైర్మన్​ సతీశ్ ​రెడ్డి అన్నారు. ఎవరో తయారు చేసిన వాటని వాడటం కాదు, అందుబాటులో ఉన్న టెక్నాలజీని ఉపయోగించి నాణ్యమైన వస్తువులను తక్కువ ఖర్చుతో తయారు చేసి అందుబాటులోకి తీసుకురావాలన్నారు.

80 మందికి గోల్డ్​మెడల్స్

వర్సిటీ నివేదికను ఓయూ వీసీ రవీందర్​యాదవ్​ చదివి వినిపించారు. 2018 జులై నుంచి 2020 మధ్యకాలంలో వివిధ గ్రూప్ లలో మాస్టర్స్, పీహెచ్‌‌‌‌డీ పూర్తి చేసిన స్టూడెంట్స్​కు కాన్వొకేషన్​ సందర్భంగా పట్టాలు, మెడల్స్ ప్రదానం చేశారు. 350 మంది పట్టాలు, 80 మంది గోల్డ్ మెడల్స్ పొందారు. గోల్డ్ మెడల్ గ్రహీతల్లో అమ్మాయిలే 68 మంది ఉండటం విశేషం. ఎంఎస్‌‌‌‌సీ ఆర్గానిక్ కెమెస్ట్రీలో 81 పర్సెంటేజ్ స్కోర్​సాధించి మొదటి స్థానంలో నిలిచిన సుశాంత్ అనే స్టూడెంట్​ ఏకంగా 5 గోల్డ్ మెడల్స్ సాధించాడు.