ఆర్డినెన్స్పై గవర్నర్ న్యాయసలహా.. ఇవాళ గవర్నర్కు క్లారిటీ ఇవ్వనున్న సీఎం

ఆర్డినెన్స్పై గవర్నర్ న్యాయసలహా.. ఇవాళ గవర్నర్కు క్లారిటీ ఇవ్వనున్న సీఎం
  • పంచాయతీరాజ్ చట్ట సవరణ ఫైల్​ను స్టడీ చేస్తున్న గవర్నర్​ 
  • నేడు గవర్నర్​కు క్లారిటీ ఇవ్వనున్న సీఎం.. ఆమోదం లాంఛనమే!

హైదరాబాద్, వెలుగు: పంచాయతీరాజ్ యాక్ట్​– 2018 సవరణ ఆర్డినెన్స్ పై గవర్నర్​జిష్టుదేవ్​వర్మ శుక్రవారం న్యాయసలహా కోరారు. రోజంతా రాజ్​భవన్​లోనే ఉన్న గవర్నర్​రాష్ట్ర ప్రభుత్వం పంపిన పంచాయతీరాజ్​చట్ట సవరణ ఆర్డినెన్స్​ ఫైల్​ను క్షుణ్ణంగా స్టడీ చేసినట్టు తెలిసింది. 2018  పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్​285 (ఏ)లో రిజర్వేషన్లు 50 శాతం మించవద్దనే నిబంధన ఉండగా, దానిని ‘కులగణన సర్వేలోని ఎంపిరికల్​ డేటా ఆధారంగా రిజర్వేషన్లు ఉంటాయి’ అని ఇటీవల ప్రభుత్వం మార్చింది. ఇలా మార్చిన ఆర్డినెన్స్ ముసాయిదా ను గవర్నర్​కు పంపగా సవరణపై ఆయన లీగల్ ఒపీనియన్ కోరినట్టు తెలిసింది. న్యాయసలహా ఆధారంగా ఆర్డినెన్స్ పై గవర్నర్​ నిర్ణయం తీసుకోనున్నట్లు రాజ్​భవన్​ వర్గాలు వెల్లడించాయి. ఒకవేళ గవర్నర్ వివరణ కోరితే క్లారిటీ ఇచ్చేందుకు పంచాయతీరాజ్​ శాఖ అధికారులు కూడా నోట్స్​సిద్ధం చేసి పెట్టుకున్నట్టు తెలిసింది. శనివారం రాజ్​భవన్​లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా అపరేశ్‌‌‌‌ కుమార్‌‌‌‌ సింగ్‌‌‌‌ పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్​ రెడ్డి హాజరవుతున్నారు. ఈ సందర్భంగా పంచాయతీరాజ్ సవరణ యాక్ట్​ సవరణ ఆర్డినెన్స్​ కు సంబంధించి  గవర్నర్​కు సీఎం  వివరించనున్నట్టు తెలిసింది. దీంతో ఆర్డినెన్స్​ ఆమోదం​ లాంఛనమే అని అధికారవర్గాలు భావిస్తున్నాయి. 

ఇప్పుడున్నదేమిటి.. సుప్రీంకోర్టు చెప్పిందేమిటి?

తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం, 2018లోని సెక్షన్ 285ఏ.. గ్రామ పంచాయతీ, మండల ప్రజా పరిషత్, జిల్లా ప్రజా పరిషత్​లలో రిజర్వేషన్లకు సంబంధించిన నిబంధనలను వివరిస్తుంది. ఈ సెక్షన్ ప్రకారం సుప్రీంకోర్టు తీర్పులను అనుసరించి, షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీ), షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీ),  బీసీ రిజర్వేషన్లు 50 శాతానికి మించి ఉండకూడదు. ఈ రిజర్వేషన్లపై నిర్ణయం ప్రభుత్వం నిర్దేశించాలని ఉంది. వాస్తవానికి  సుప్రీంకోర్టులో 1992లో ఇంద్ర సాహ్నీ వర్సెస్ కేంద్ర ప్రభుత్వం కేసులో "అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే రిజర్వేషన్లు 50 శాతం మించాలని, అత్యంత జాగ్రత్తగా, ప్రత్యేక కారణాలు ఉంటేనే ఇది సమర్థనీయం ” అని కోర్టు స్పష్టం చేసింది.  2010లో "కె. కృష్ణమూర్తి వర్సెస్ భారత ప్రభుత్వం" కేసులో సుప్రీంకోర్టు స్థానిక స్వపరిపాలన సంస్థల్లో రిజర్వేషన్ల అంశాన్ని ప్రత్యేకంగా పరిశీలించింది. ఆర్టికల్​ 243డీ  ప్రకారం స్థానిక సంస్థల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రిజర్వేషన్లు చెల్లుబాటు అవుతాయని కోర్టు పేర్కొంటుంది.  50 శాతం పరిమితి దాటలాంటే "అసాధారణ పరిస్థితులు" ఉండాలని మరోసారి స్పష్టంచేసింది. ఈ నేపథ్యంలో రిజర్వేషన్లు 50శాతం పరిమితి మించితే ఎలాగూ కోర్టులు ఉంటాయి కనుక ఆర్డినెన్స్​కు గవర్నర్​ ఆమోదముద్ర వేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.