టెక్నికల్​ విద్యలో జేఎన్టీయూ అగ్రగామి: గవర్నర్ ​జిష్ణుదేవ్​ వర్మ

టెక్నికల్​ విద్యలో  జేఎన్టీయూ అగ్రగామి: గవర్నర్ ​జిష్ణుదేవ్​ వర్మ


కూకట్​పల్లి, వెలుగు: టెక్నికల్ విద్యలో జేఎన్టీయూ హైదరాబాద్​దేశంలోనే అగ్రగామిగా నిలుస్తోందని గవర్నర్​జిష్ణుదేవ్​వర్మ తెలిపారు. దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి స్టూడెంట్లు వచ్చి విద్యను అభ్యసించటం గర్వకారణం అన్నారు. జేఎన్టీయూ13వ స్నాతకోత్సవాన్ని మంగళవారం క్యాంపస్​లో నిర్వహించారు. ముఖ్యఅతిథిగా గవర్నర్​పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు పోటీ తత్వాన్ని పెంచుకోవాలన్నారు. జ్ఞానాన్ని వ్యక్తిగత అభివృద్ధితోపాటు సమాజ సేవ కోసం వినియోగించాలన్నారు. 

25 దేశాల నుంచి 237 మంది విద్యార్థులు జేఎన్టీయూలో చేరటంతో గ్లోబల్ గా గుర్తింపు లభించిందని, ఈ అవకాశాలను ఇక్కడి విద్యార్థులు కూడా సద్వినియోగం చేసుకుని అన్ని ప్రాంతాల్లో ఉపాధి పొందాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వర్సిటీకి రూ.498 కోట్ల పరిశోధనా నిధులు మంజూరు చేసిందంటే ఎంతటి ప్రాధాన్యం ఇస్తున్నారో అర్థం చేసుకోవాలన్నారు.  2023–-24 సంవత్సరంలోయూజీ, పీజీ, డాక్టర్​ ఆఫ్​ ఫార్మసీ, డాక్టరేట్ కోర్సుల్లో ఉత్తీర్ణత సాధించిన 91,84‌‌0 విద్యార్థులకు డిగ్రీలను ప్రదానం చేశారు. వీరిలో గోల్డ్​మెడల్​సాధించిన 74 మంది విద్యార్థులను గవర్నర్​ జిష్ణుదేవ్​వర్మ ప్రత్యేకంగా అభినందించారు. ఆల్​ ఇండియా కౌన్సిల్​ ఫర్​ టెక్నికల్​ఎడ్యుకేషన్​చైర్మన్​ టి.జి.సీతారాం, వీసీ కిషన్​కుమార్​రెడ్డి, రిజిస్ట్రార్​ వెంకటేశ్వరరావు, రెక్టార్ విజయ్​కుమార్​రెడ్డి పాల్గొన్నారు.