- విచారణ వెంటనే పూర్తి చేయాలని రాష్ట్ర సర్కార్కు గవర్నర్ లేఖ
- నిందితులపై చర్యలు తీసుకోవాలని ఆదేశం
- రాష్ట్ర రాజకీయాల్లో గవర్నర్ లేఖపై చర్చ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన లాయర్ దంపతులు వామన్రావు, నాగమణి హత్యలపై గవర్నర్ తమిళిసై స్పందించారు. హత్యలపై విచారణను తొందరగా పూర్తి చేయాలని, సమగ్ర నివేదిక ఇవ్వాలని రాష్ట్ర సర్కార్కు లేఖ రాశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సర్కార్కు గవర్నర్ లేఖ రాసినట్టు రాజ్భవన్ వర్గాలు వెల్లడించాయి. మీడియాలో వార్తల ద్వారా లాయర్ దంపతుల హత్య గురించి ఆమె తెలుసుకున్నారని చెబుతున్నారు.
హత్యలపై గవర్నర్ స్పందిచడం పట్ల రాష్ట్ర రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. వామన్రావు హత్యపై హైకోర్టు చీఫ్ జస్టిస్, అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, లాయర్లతో పాటు అందరూ స్పందించారు. హత్యలపై విచారణ నిదానంగా సాగుతోందని, పోలీసులు సరిగ్గా స్పందించడం లేదని ఆరోపణలున్నాయి. హత్య వెనుక అధికార పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ఉన్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సర్కారుకు గవర్నర్ లేఖ రాయడం చర్చకు దారితీసింది. ఇటీవలే పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గానూ తమిళిసైకి రాష్ట్రపతి అదనపు బాధ్యతలు అప్పగించారు. అప్పటి నుంచి ఆమె పుదుచ్చేరిలోనే ఉన్నారు. అక్కడి వ్యవహారాలూ చూసుకుంటూనే రాష్ట్ర రాజ్భవన్ అధికారులతోనూ ఎప్పటికప్పుడు వీడియో కాన్ఫరెన్సులు నిర్వహిస్తున్నారు. ఆన్లైన్లో వచ్చిన సమస్యల గురించి ప్రభుత్వానికి సమాచారం పంపుతున్నారు. పుదుచ్చేరిలో ఉన్నా తెలంగాణకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తానని గవర్నర్ ఈమధ్యే చెప్పారు.