
- ప్రభుత్వం అంచనా
న్యూఢిల్లీ : ప్రస్తుతం కిలోకు సగటున రూ.57.02గా ఉన్న ఉల్లి ధర జనవరి నాటికి రూ.40కి తగ్గుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. గత వారం దేశ రాజధానిలో వీటి రిటైల్ అమ్మకాల ధర మండీలలో కిలోకు రూ. 60 దాటి రూ. 80కి చేరుకోవడంతో వచ్చే ఏడాది మార్చి వరకు ఉల్లి ఎగుమతులను ప్రభుత్వం నిషేధించింది. ఉల్లి ధర కిలోకు రూ. 40 కంటే ఎప్పుడు తగ్గుతుందన్న ప్రశ్నకు ‘‘జనవరిలోనే పడిపోవచ్చు. ఉల్లి ధర కిలో రూ. 100కి చేరుకుంటుందని కొందరు అన్నారు. ఇది ఎప్పటికీ రూ. 60 దాటదని మేం చెబుతూనే ఉన్నాం. సోమవారం ఉదయం మొత్తం భారతదేశ సగటు కిలో రూ. 57.02 మాత్రం అది కిలో రూ. 60 దాటదు” కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ తెలిపారు.
ఢిల్లీలో జరిగిన 'డెలాయిట్ గ్రోత్ విత్ ఇంపాక్ట్ గవర్నమెంట్ సమ్మిట్'లో ఆయన మాట్లాడుతూ ఎగుమతులపై నిషేధం వల్ల రైతులపై ప్రభావితం ఉండదని, ఇది భారతీయ బంగ్లాదేశ్ మార్కెట్లలో ధరల మధ్య తేడాల ద్వారా దోపిడీ చేసే వ్యాపారులకే నష్టమని అన్నారు. అంతిమంగా భారతీయ వినియోగదారుడికి మేలు జరుగుతుందని చెప్పారు. వినియోగదారుల ధరల ద్రవ్యోల్బణం (సీపీఐ)లో ఉల్లి ద్రవ్యోల్బణం రెట్టింపు అయింది. ఈ ఏడాది అక్టోబర్లో దాదాపు నాలుగు సంవత్సరాల గరిష్ట స్థాయి 42.1 శాతానికి పెరిగింది. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి ఆగస్టు 4 వరకు దేశం నుంచి 9.75 లక్షల టన్నుల ఉల్లిపాయలు ఎగుమతి అయ్యాయి. ఎక్కువ దిగుమతి చేసుకునే మూడు దేశాల్లో బంగ్లాదేశ్, మలేషియా, యూఏఈ ఉన్నాయి. ప్రస్తుతం కొనసాగుతున్న ఖరీఫ్ సీజన్లో ఉల్లి సాగు తక్కువగా ఉండటంతో ధరలు పెరగడం ప్రారంభించాయి. వినియోగదారులకు ఉపశమనం కలిగించడానికి రిటైల్ మార్కెట్లలో కిలోకు రూ. 25 సబ్సిడీ రేటుతో బఫర్ ఉల్లిపాయ స్టాక్ను విక్రయించాలని కేంద్రం అక్టోబరులో నిర్ణయించింది. ధరల నియంత్రణకు ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది.