ఫ్రాక్షనల్​ షేర్లకు సెబీ, గవర్నమెంట్​ సానుకూలం

ఫ్రాక్షనల్​ షేర్లకు సెబీ, గవర్నమెంట్​ సానుకూలం

న్యూఢిల్లీ: కొన్ని రకాల కంపెనీలు ఫ్రాక్షనల్​ షేర్లు జారీ చేయడానికి సెబీ, కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు సమాచారం. గత కొన్నేళ్లుగా రిటైల్​ ఇన్వెస్టర్ల పార్టిసిపేషన్​ పెరుగుతుండటంతో, దీనికి మరింత ఊపు తెచ్చేందుకు ఈ సానుకూలత సాయపడనుందని సీనియర్​ ఆఫీసర్​ ఒకరు వెల్లడించారు. హై–వాల్యూ షేర్లను రిటైల్​ ఇన్వెస్టర్లను కొనుగోలు చేయడానికి ఫ్రాక్షనల్​ షేర్ల మెకానిజం వీలు కల్పిస్తుంది. ఫలితంగా లిక్విడిటీ కూడా పెరుగుతుందని ఆ ఆఫీసర్​ పేర్కొన్నారు. ఈ విషయంపై ఇప్పటికే సెబీ, మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్‌‌‌‌ ( ఎంసీఏల) మధ్య డిస్కషన్​ జరిగిందని, సెబీ త్వరలో డిటెయిల్డ్​ ప్రెజెంటేషన్​​ ఇస్తుందని వివరించారు. ఫ్రాక్షనల్​ షేర్లను తేవాలంటే కంపెనీల చట్టానికి సవరణలు చేయాల్సి ఉంటుంది.

లిస్టెడ్​, అన్​లిస్టెడ్ కంపెనీలు రెండింటికీ ఒకేవిధమైన రూల్స్​ ఉండొచ్చని, లిస్టెడ్​ కంపెనీలకు ఫ్రాక్షనల్​ షేర్ల మెకానిజం బాగా కలిసి వస్తుందని సీనియర్​ ఆఫీసర్​ చెప్పారు. ఎంఆర్​ఎఫ్​, హనీవెల్​ ఆటోమేషన్​, పేజ్​ ఇండస్ట్రీస్​ వంటి కంపెనీల షేర్లు ఎక్కువ విలువతో ట్రేడవుతున్నాయి. దీంతో ఇలాంటి షేర్లను చాలా మంది రిటైల్​ ఇన్వెస్టర్లు కొనుగోలు చేయడానికి అవకాశం ఉండటం లేదు. ఫ్రాక్షనల్​ షేర్స్​ మెకానిజం తీసుకు వస్తే అలాంటి అధిక వాల్యూ షేర్లను సైతం రిటైల్​ ఇన్వెస్టర్లు కొనుగోలు చేయడం సాధ్యపడుతుంది. ఈ ఆలోచనతోనే ఫ్రాక్షనల్​ షేర్స్​ మెకానిజం పట్ల సెబీ, ఎంసీఏలు సానుకూలత చూపిస్తున్నాయి. కెనడా, జపాన్​, అమెరికా వంటి దేశాలలో ఫ్రాక్షనల్​ షేర్స్​ మెకానిజం ఎప్పటి నుంచో అమలులో ఉంది.