
- ఇచ్చిన మాట ప్రకారం పనులు పూర్తి చేశాం
వేములవాడరూరల్, వెలుగు: ప్రజలకు కనీస మౌలిక వసతుల కల్పనే ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం హన్మాజీపేట నక్క వాగుపై రూ.11.55 కోట్లతో నూతనంగా నిర్మించిన హైలెవల్ బ్రిడ్జి, కోరుట్ల, వేములవాడ ప్రధాన రహదారిపై నిర్మించిన మర్రిపల్లి బ్రిడ్జిలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గ పరిధిలో గతంలో అనేక సమస్యలపై రాజీలేని పోరాటం చేశామన్నారు.
ఎమ్మెల్యేగా గెలిచాక ఆ సమస్యలను పరిష్కారం చేసుకుంటూ ముందుకు పోతున్నామన్నారు. నక్కవాగుపై, మర్రిపల్లిలో బ్రిడ్జి నిర్మాణం వేములవాడ రాజన్న ఆలయ పట్టణ అభివృద్ధిపై, కలికోట సూరమ్మ చెరువు రిజర్వాయర్ నిర్మాణం కోసం వేచి చూశామని, ఇప్పుడు ఒక్కొక్కటిగా పూర్తి చేస్తున్నామని తెలిపారు. ఏఎంసీ చైర్మన్ రొండి రాజు, చెన్నాడి గోవర్ధన్, సోయినేని కరుణాకర్, మల్లేశం, వకుళాభరణం శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.