కార్యదర్శి వేధింపులతో సూసైడ్ అటెంప్ట్..పురుగు మందు తాగిన జీపీ జవాన్ ..ములుగు జిల్లాలో ఘటన

కార్యదర్శి వేధింపులతో సూసైడ్ అటెంప్ట్..పురుగు మందు తాగిన జీపీ జవాన్ ..ములుగు జిల్లాలో ఘటన
  •      ఎంజీఎంలో చికిత్స పొందుతున్న బాధితుడు

    
ములుగు(గోవిందరావుపేట), వెలుగు : పంచాయతీ కార్యదర్శి వేధిస్తున్నాడని  జవాన్​ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ములుగు జిల్లాలో జరిగింది.  బాధితుడు రాసిన సూసైడ్​నోట్​సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన, సూసైడ్ నోట్ లోని వివరాలు ఇలా ఉన్నాయి. 

గోవిందరావుపేటకు చెందిన చిలుక వెంకన్న పంచాయతీ జవాన్.​ కాగా.. కార్యదర్శి శంకర్​తనను మానసికంగా వేధిస్తున్నాడని ఆరోపిస్తూ బుధవారం ఉదయం పురుగుల మందు తాగాడు. వెంకన్నను తోటి ఉద్యోగులు వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించి, అక్కడి నుంచి మెరుగైన వైద్యానికి ఎంజీఎంకు తీసుకెళ్లారు. బాధితుడు డీపీవోకు రాసినసూసైడ్ నోట్ బయటపడగా.. అందులో తన ఆత్మహత్యకు జీపీ కార్యదర్శి శంకర్​కారణమని ఆరోపించాడు. 

తనను పదే పదే తిడుతూ డబ్బులు డిమాండ్​చేస్తున్నా డని, ఇవ్వనందుకు అవమానపరిచాడని పేర్కొన్నాడు. ఇటీవల జరిగిన ఎంపీడీవో  వీడ్కోలు కార్యక్రమానికి రూ.30వేలు, గత నెల 24న తన కొడుకు పెండ్లి జరిగిన అనంతరం15రోజులకు డ్యూటీలో చేరగా రూ.50వేలు అడిగాడని ఆరోపించాడు. 

ఇలా వేధింపులు, అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్టు తెలిపాడు. ఘటనపై డీఎల్పీవో జె.శ్రీధర్ రావును వివరణ కోరగా పూర్తిస్థాయి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రస్తుతం వెంకన్న ఆరోగ్యం నిలకడగా ఉందని, అవసరమైన వైద్యం అందిస్తున్నామని చెప్పారు.