గ్రామపంచాయతీ కార్మికుల సమ్మె

గ్రామపంచాయతీ కార్మికుల సమ్మె
  • మండలకేంద్రాల్లో ధర్నాలు
  • సమస్యలు పరిష్కరించాలని డిమాండ్​ 

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రామకృష్ణ డిమాండ్ చేశారు. గురువారం నాగర్ కర్నూల్, తాడూర్, తెలకపల్లి ఎంపీడీవో ఆఫీస్​ ఎదుట సమ్మె చేశారు. 9 నెలల నుంచి పీఆర్సీ అమలు చేయలేదని తెలిపారు. కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకుంటే సమ్మె ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు రామయ్య, కాశన్న పాల్గొన్నారు. 
ఆమనగల్లు/ కోస్గి టౌన్, వెలుగు : గ్రామపంచాయతీ కార్మికులందరికి ఉద్యోగ భద్రతను కల్పిస్తూ వేతనాలను పెంచాలని ఐఎల్టీయూ జిల్లా అధ్యక్షులు ఎదిరింటి నర్సింహులు డిమాండ్ చేశారు. డిమాండ్ల సాధన కోసం పంచాయతీ కార్మికులు చేపట్టిన సమ్మెకు మద్దతుగా కోస్గిలో ఆయన మాట్లాడారు. జీవోనం. 60 ప్రకారం వేతనాలు పెంచాలని, ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్​ను కేటాయించాలన్నారు. ఆయనతో జిల్లా ఉపాధ్యక్షుడు రాములు, మండల అధ్యక్షుడు వెంకటయ్య ఉన్నారు. 

అలాగే కడ్తాల్ మండల కేంద్రంలో కార్మికులు ధర్నా నిర్వహించారు. సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యుడు కురుమయ్య మాట్లాడుతూ.. కార్మకులకు పీఎఫ్​, ఈఎస్ఐ, రూ. 10 లక్షల ప్రమాద బీమా కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పంచాయతీ కార్మిక సంఘం నాయకులు వెంకటమ్మ, ఆశీర్వాదం, దశరథం, పరమేశ్​ తదితరులు పాల్గొన్నారు.