హైదరాబాద్, వెలుగు: త్యాగానికి ప్రతీకగా జరుపుకునే బక్రీద్ (ఈద్ ఉల్ అజ్ ) పండుగ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఇస్లాం ప్రవక్తల్లో ఒకరైన ఇబ్రహీం అస్సలామ్, అల్లాహ్ ఆజ్ఞను శిరసా వహించి తన కుమారుడిని సైతం బలి ఇచ్చేందుకు సిద్ధం కావడాన్ని స్మరిస్తూ ప్రపంచ వ్యాప్తంగా ముస్లింలు సోమవారం ఈ పండుగ జరుపుకుంటున్నారని ఆదివారం పత్రిక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రవక్తల అచంచలమైన దైవ భక్తి, త్యాగ నీరతికి బక్రీద్ పండుగ అద్దం పడుతుందని సీఎం అన్నారు. జీవితంలో ఎదురయ్యే సమస్యలకు భయపడకుండా, దేవునిపై విశ్వాసంతో సన్మార్గంలో జీవనం సాగించాలని బక్రీద్ పండుగ మానవాళికి గొప్ప సందేశాన్ని ఇస్తుందని చెప్పారు. తమకు ఉన్న దాంట్లో నుంచే ఇతరులకు పంచిపెట్టడాన్ని మించిన దాతృత్వం మరొకటి లేదనే స్ఫూర్తిని చాటి చెపుతోందని సీఎం అభిప్రాయపడ్డారు.
త్యాగ స్ఫూర్తికి నిదర్శనం: గవర్నర్ సీపీ రాధాకృష్ణన్
ముస్లింలకు గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ బక్రీద్ గ్రీటింగ్స్ తెలిపారు. ముస్లింల కుటుంబాల్లో సుఖ, సంతోషాలు వెల్లివిరియాలని గవర్నర్ ఆకాంక్షించారు. భక్తి, త్యాగానికి బక్రీద్ ప్రతీక అని ఆయన అన్నారు. ఆపదలో ఉన్న వాళ్లను ఆదుకోవడం, దాన, ధర్మాల వంటివి ఇస్లాం సంప్రదాయంలో భాగమని చెప్పారు.
