
అలీగఢ్(ఉత్తరప్రదేశ్): ‘‘నీ పెండ్లి జీవితంలో మరిచిపోలేం” ఈ డైలాగ్ను మనం సినిమాల్లోనే కాదు.. చాలా సార్లు నిజజీవితంలోనూ వింటూనే ఉంటాం. ఉత్తరప్రదేశ్లోని విధిపూర్ గ్రామస్తులు ఇప్పుడు ఇదే మాట అంటున్నారు. ఆ గ్రామానికి చెందిన సావిత్రికి గత నెలలోనే పెండ్లయ్యింది. మార్చి 21న తన అత్తారింటికి వెళ్లేందుకు 12 మంది బరాత్ బృందం వచ్చింది. వీరంతా మార్చి 23న జార్ఖండ్లోని ధన్బాద్ జిల్లాకు వెళ్లాల్సి ఉంది. కానీ ఆ రోజు నుంచి దేశ వ్యాప్తంగా లాక్డౌన్ అమలులోకి వచ్చింది. దీంతో పెండ్లి కొడుకు, పెండ్లి కూతురుతో పాటు బరాత్ కోసం వచ్చిన అందరూ విధిపూర్ గ్రామంలోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఇప్పటికి వారంతా వచ్చి మూడు వారాలు గడిచింది. వారంతా వెళ్లడానికి లేదు. దీంతో బరాత్ కోసం వచ్చిన కొంత మంది సహనం కోల్పోతున్నారు. కానీ ఎవరూ చేయగలిగింది ఏమీ లేదు. తన పరిస్థితి ఏమిటో తెలియక సావిత్రి పూర్తిగా గందరగోళంలో పడిపోయింది. సావిత్రి ఫ్యామిలీనే బరాత్ కోసం వచ్చిన వారందరికీ అన్ని సదుపాయాలు కల్పిస్తోంది. వారి పరిస్థితి తెలుసుకున్న జిల్లా అధికారులు ఒక పూట భోజనం అందిస్తున్నారు. బరాత్ కోసం వచ్చిన వారందరికీ కరోనా టెస్టులు చేయగా.. అందరికీ నెగెటివ్ వచ్చింది. మార్చి 20న తమ ఊరి నుంచి వచ్చేటప్పుడు అసలు ఇన్ని రోజులు ఉండాల్సి వస్తుందని తాము ఊహించలేదని బరాత్ కోసం వచ్చిన వారు చెప్పారు. లాక్డౌన్ను ఇంకా పొడిగించే అవకాశాలు కనిపిస్తుండటంతో వీరంతా ఎప్పుడు ధన్బాద్ వెళతారనే దానిపై ప్రస్తుతానికి స్పష్టత లేదు. దీంతో ఈ పెండ్లి గురించి విధిపూర్ గ్రామస్తులు మాట్లాడుతూ.. తమ జీవితంలో ఈ పెండ్లిని మాత్రం మరిచిపోలేం అని చెబుతున్నారు.