వేరు శనగ రైతుల పంట పండింది పో.. జడ్చర్ల మార్కెట్లో రికార్డు ధర పలికిన పల్లీలు

వేరు శనగ రైతుల పంట పండింది పో.. జడ్చర్ల మార్కెట్లో రికార్డు ధర పలికిన పల్లీలు

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల వ్యవసాయ మార్కెట్​లో వేరుశనగ క్వింటాలు రూ.12,571 పలికింది. ప్రభుత్వ మద్దతు ధర రూ. 7,262 కంటే డబుల్​ ధర పలికిందని మార్కెట్​వర్గాలు తెలిపాయి. మార్కెట్​కు మంగళవారం (జనవరి 27) 2,080 క్వింటాళ్ల వేరుశనగ పంట వచ్చింది.

జడ్చర్ల, వెలుగు: మహబూబ్ నగర్ జిల్లాలోని జడ్చర్ల వ్యవసాయ మార్కెట్ లో వేరుశనగ ధర రికార్డు సృష్టించింది. మంగళవారం (జనవరి 27) క్వింటాలు ధర రూ.12,571 పలికింది. పెరిగిన ధరపై రైతులు ఆనందం వ్యక్తం చేశారు. ప్రభుత్వ మద్దతు ధర రూ. 7,262 కంటే డబుల్​ధర పలికిందని మార్కెట్​వర్గాలు తెలిపాయి.  

మార్కెట్​కు 2,080 క్వింటాళ్ల వేరుశనగ పంట అమ్మకానికి వచ్చింది. క్వింటాలు ధర గరిష్టంగా రూ.12,571కు వ్యాపారులు కొనుగోలు చేశారు.  సోమవారం కనిష్టంగా క్వింటాలు ధర రూ. 7,409, మధ్యస్తంగా క్వింటాలు ధర రూ.11,225 పలికినట్లు జడ్చర్ల వ్యవసాయ మార్కెట్ అధికారులు తెలిపారు. 

మార్కెట్​చరిత్రలోనే ప్రస్తుత సీజన్​లో వేరుశనగ రికార్డు ధర పలికిందని పేర్కొన్నారు. గతేడాది క్వింటాలు ధర గరిష్టంగా రూ.8 వేలు నమోదైంది. వచ్చే రెండు రోజుల్లో ధర రూ. 13 వేలు దాటే అవకాశం ఉండొచ్చని  మార్కెట్ అధికారులు, రైతులు పేర్కొన్నారు.