
- రూ.12.2 లక్షల కోట్లకు చేరిక
- అయినా యాక్టివ్ ఫండ్స్దే హవా
- పాసివ్ ఫండ్స్పై ప్రజల్లో పెరుగుతున్న అవగాహన: మోతీలాల్ ఓస్వాల్ సర్వే
న్యూఢిల్లీ: ఇండియాలో ఇండెక్స్ ఫండ్స్, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్) వంటి పాసివ్ ఫండ్స్కు డిమాండ్ పెరుగుతోంది. 2019లో రూ.1.91 లక్షల కోట్లుగా ఉన్న పాసివ్ ఫండ్స్ అసెట్ అండర్ మేనేజ్మెంట్ (ఏయూఎం) 2025 నాటికి రూ.12.2 లక్షల కోట్లకు చేరింది. అంటే ఆరేళ్లలో ఆరు రెట్లు వృద్ధి చెందింది. 2023 మార్చి నుంచి ఇప్పటివరకు కేవలం రెండేళ్లలోనే ఏయూఎం 1.7 రెట్లు పెరగడం విశేషం. మోతీలాల్ ఓస్వాల్ మ్యూచువల్ ఫండ్ విడుదల చేసిన తాజా సర్వే ఈ విషయాన్ని వెల్లడించింది.
దేశవ్యాప్తంగా 3 వేల మంది ఇన్వెస్టర్లు, 120 మంది డిస్ట్రిబ్యూటర్లు (మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్లు, రిజిస్టర్డ్ అడ్వైజర్లు, వెల్త్ మేనేజర్లు) ఈ సర్వేలో పాల్గొన్నారు. దీని ప్రకారం, 2025 నాటికి 76 శాతం మంది ఇన్వెస్టర్లు ఇండెక్స్ ఫండ్స్ లేదా ఈటీఎఫ్స్ గురించి అవగాహన కలిగి ఉన్నారు. 2023లో 61 శాతం మంది మాత్రమే పాసివ్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టగా, 2025 నాటికి ఇది 68 శాతానికి పెరిగింది. అయినప్పటికీ, ఇంకా మూడో వంతు మంది ఇన్వెస్టర్లు పాసివ్ ఫండ్స్కు దూరంగా ఉన్నారు. వారిలో కొంతమంది యాక్టివ్ ఫండ్స్ వైపు మొగ్గు చూపుతుండగా, మరికొంత మందికి పాసివ్ ఫండ్స్పై సరైన అవగాహన లేదు.
ఫండ్ మేనేజర్ల పోర్టు ఫోలియోలో పాసివ్ ఫండ్స్
ఖర్చు తక్కువ, డైవర్సిఫికేషన్, సులభంగా ఇన్వెస్ట్ చేయగలగడం, పారదర్శకత ఉండడంతో పాసివ్ ఫండ్స్కు ఆదరణ పెరుగుతోంది. డిస్ట్రిబ్యూటర్ల సర్వేలో కూడా ఇదే ధోరణి కనిపించింది. 93 శాతం మంది డిస్ట్రిబ్యూటర్లు పాసివ్ ఫండ్స్ను అర్థం చేసుకున్నారని, వారిలో 46 శాతం మందికి వీటిపై ఎక్కువ నాలెడ్జ్ ఉందని, 70 శాతం మంది తమ క్లయింట్ల పోర్ట్ఫోలియోలో పాసివ్ ఫండ్స్ను చేర్చుతున్నారని మోతీలాల్ ఓస్వాల్ మ్యూచువల్ ఫండ్ సర్వే వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పాసివ్ ఫండ్లకు కేటాయింపును కనీసం 5 శాతం పెంచాలని 93 శాతం మంది డిస్ట్రిబ్యూటర్లు భావిస్తున్నారు.
ప్రస్తుతం 70 శాతం క్లయింట్లు మూడు కంటే తక్కువ పాసివ్ ఫండ్స్ అందిస్తున్నారు. కానీ, ఎక్కువ ఫోకస్ యాక్టివ్ ఫండ్స్పైనే ఉంది. “ఇటీవల సంవత్సరాల్లో పాసివ్ స్ట్రాటజీలకు గిరాకీ పెరిగింది. గతంలో కొంత మంది ఇన్వెస్టర్ల మాత్రమే వీటిలో ఇన్వెస్ట్ చేసేవారు. ప్రస్తుతం పాసివ్ ఫండ్స్పై ఇన్వెస్టర్లలో అవగాహన పెరిగింది. ఇండెక్స్ ఆధారిత ఫండ్స్కే పరిమితం కాకుండా, ఇన్నోవేటివ్ పాసివ్ స్ట్రాటజీలపై కూడా ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతున్నారు” అని మోతీలాల్ ఓస్వాల్ ఏఎంసీలో పాసివ్ బిజినెస్ చీఫ్ ప్రతీక్ ఓస్వాల్ అన్నారు.