- 5 % శ్లాబ్ను 8 శాతానికి పెంచాలని రికమండ్ చేసిన మినిస్టర్స్ ప్యానెల్
- 8%, 18%, 28% శ్లాబ్లతో కొత్త జీఎస్టీ సిస్టమ్!
- జీఎస్టీ మినహాయింపులు పొందే ప్రొడక్ట్లు తగ్గుతాయ్
- ఈ నెల చివరిలో సమావేశం కానున్న జీఎస్టీ కౌన్సిల్
న్యూఢిల్లీ: గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్టీ) శ్లాబ్లను పెంచే ఆలోచనలో జీఎస్టీ కౌన్సిల్ ఉన్నట్టు కనిపిస్తోంది. జీఎస్టీ సిస్టమ్లో తక్కువ శ్లాబ్ అయిన 5 శాతాన్ని 8 శాతానికి పెంచాలని వివిధ రాష్ట్రాల ఫైనాన్స్ మినిస్టర్లతో కూడిన ప్యానెల్ ఒకటి ప్రపోజ్ చేసింది. ఈ ప్యానెల్ రికమండేషన్స్ను ఈ నెల చివరిలో జీఎస్టీ కౌన్సిల్ పరిశీలించనుందని అంచనా. ట్యాక్స్ శ్లాబ్లను పెంచడంతో పాటు, జీఎస్టీ కింద మినహాయింపులు పొందుతున్న ప్రొడక్ట్ల లిస్టును తగ్గించాలని కూడా ఈ ప్యానెల్ తన రిపోర్ట్లో పేర్కొంది. జీఎస్టీ కాంపన్సేషన్ కోసం రాష్ట్రాలు కేంద్రంపై ఆధారపడడాన్ని తొలగించేందుకు ఈ ప్యానెల్ వివిధ మార్గాలను విశ్లేషించిందని ఈ విషయం తెలిసిన వ్యక్తులు పేర్కొన్నారు. ఈ రికమండేషన్స్పై జీఎస్టీ కౌన్సిల్ తన నెక్స్ట్ మీటింగ్లో ఓ నిర్ణయం తీసుకోనుంది.
అదనంగా రూ. 1.5 లక్షల కోట్ల రెవెన్యూ..
ప్రస్తుతం జీఎస్టీ సిస్టమ్లో 5 శాతం, 12 శాతం, 18 శాతం, 28 శాతం శ్లాబ్లను అమలు చేస్తున్నారు. అత్యవసరమైన ప్రొడక్ట్లపై జీఎస్టీని మినహాయించడం లేదా తక్కువ శ్లాబ్లోకి తీసుకురావడమో చేశారు. లగ్జరీ గూడ్స్, సిన్ గూడ్స్ (ఆల్కహాల్, సిగరెట్స్ వంటివి) పై 28 శాతం జీఎస్టీ వేస్తున్నారు. దీనిపై అదనంగా సెస్ విధిస్తున్నారు. ఈ సెస్ ద్వారా వచ్చే రెవెన్యూని రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం చెల్లించడానికి వినియోగిస్తున్నారు. 5 శాతం జీఎస్టీ శ్లాబ్ను 8 శాతానికి పెంచాలని పైన పేర్కొన్న మినిస్టర్స్ ప్యానెల్ ప్రపోజ్ చేయగా, ఒక శాతం జీఎస్టీ పెంచితే ఏడాదికి అదనంగా రూ. 50 వేల కోట్లు రెవెన్యూ వస్తుందని అంచనా. అదే 5 శాతం శ్లాబ్ రేటు మూడు శాతం పాయింట్లు పెరిగితే ప్రభుత్వానికి అదనంగా రూ. 1.5 లక్షల కోట్ల రెవెన్యూ వస్తుందని అంచనా. జీఎస్టీ శ్లాబ్లను రేషనలైజ్ చేయడంలో భాగంగా మూడు శ్లాబ్ల జీఎస్టీ సిస్టమ్ను తీసుకురావాలని ఈ ప్యానెల్ ప్రపోజ్ చేసింది. ఇందులో భాగంగా 8 శాతం, 18 శాతం, 28 శాతం జీఎస్టీ శ్లాబ్లను అమలు చేయాలని రికమండ్ చేసిందని ఈ విషయం తెలిసిన వ్యక్తులు చెప్పారు. ఈ ప్రపోజల్స్ను జీఎస్టీ కౌన్సిల్ పరిగణనలోకి తీసుకుంటే, ఇప్పటి వరకు 12 శాతం శ్లాబ్లో ఉన్న ప్రొడక్ట్లు 18 శాతం శ్లాబ్లోకి వస్తాయి. బ్రాండ్ లేని, ప్యాకేజ్డ్ కాని ఫుడ్ అండ్ డెయిరీ ప్రొడక్ట్లపై జీఎస్టీ లేదు. ఇలా జీఎస్టీ మినహాయింపు పొందుతున్న ప్రొడక్ట్ల లిస్టును తగ్గించాలని కూడా ఈ ప్యానెల్ రికమండ్ చేసింది. ఈ మినిస్టర్ల ప్యానెల్ ఇచ్చిన రిపోర్ట్స్పై చర్చించేందుకు ఈ నెల చివరిలో లేదా ఏప్రిల్ స్టార్టింగ్లో జీఎస్టీ కౌన్సిల్ సమావేశమయ్యే అవకాశం ఉంది. గత ఐదేళ్ల నుంచి వివిధ ప్రొడక్ట్లపై జీఎస్టీని తగ్గించడం వంటి చర్యలతో రాష్ట్రాలకు రూ. లక్ష కోట్ల రెవెన్యూ కొరత ఏర్పడిందని ఎనలిస్టులు చెబుతున్నారు. ఈ గ్యాప్ను తగ్గించడానికి ట్యాక్స్ శ్లాబ్లను పెంచడం, ట్యాక్స్ ఎగవేతలను ఆపడమే మార్గమని పేర్కొన్నారు. కాగా, గత ఐదేళ్లలో 28 శాతం ట్యాక్స్ శ్లాబ్లో ఉన్న ప్రొడక్ట్ల సంఖ్యను 228 నుంచి 35 కిందకు తగ్గించిన విషయాన్ని మరిచిపోకూడదు. జీఎస్టీ రేట్లను సవరించడానికి, రెవెన్యూను పెంచుకునే మార్గాలను గుర్తించడానికి వివిధ రాష్ట్రాల ఫైనాన్స్ మినిస్టర్లతో కూడిన ప్యానెల్ను కిందటేడాది జీఎస్టీ కౌన్సిల్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
జూన్తో జీఎస్టీ కాంపన్సేషన్కు ముగింపు..
జీఎస్టీకి మారడం వలన రాష్ట్రాలకు వచ్చే రెవెన్యూ లాస్ను ఐదేళ్ల వరకు కేంద్రం పరిహారంగా అందించాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. 2015-–16 బేస్ ఇయర్ రెవెన్యూలో ఏడాదికి 14 శాతాన్ని రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారంగా ఇవ్వడానికి కేంద్రం ఒప్పుకుంది. ఈ ఏడాది జూన్తో జీఎస్టీ అమల్లోకి వచ్చి ఐదేళ్లు పూర్తవుతుంది. ఇక రాష్ట్రాలు తమ రెవెన్యూ కొరతపై కేంద్రంపై ఆధారపడడానికి అవ్వదు. దీంతో రాష్ట్రాలే తమ రెవెన్యూ గ్యాప్ను పూడ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ ఏడాది జూన్ నాటికి కేంద్రం రాష్ట్రాలకు చెల్లించాల్సిన జీఎస్టీ కాంపన్సేషన్ టైమ్ పీరియడ్ ముగుస్తుంది. దీంతో రాష్ట్రాలు ఇక రెవెన్యూ గ్యాప్ను తగ్గించుకోవడానికి సొంత మార్గాలు చూసుకోవాల్సిన అవసరం ఉంటుందని పైన పేర్కొన్న ప్యానెల్ తన రిపోర్ట్లో వెల్లడించింది.