
స్టావాంగర్: నార్వే చెస్ టోర్నమెంట్లో ఇండియా గ్రాండ్ మాస్టర్ వరల్డ్ చాంపియన్ డి. గుకేశ్ అద్భుత విజయం సాధించాడు. వరల్డ్ నంబర్ వన్, నార్వే లెజెండ్ మాగ్నస్ కార్ల్సన్ను క్లాసికల్ గేమ్లో తొలిసారి ఓడించి సంచలనం సృష్టించాడు. నాలుగు గంటల పాటు సాగిన ఆరో రౌండ్ గేమ్లో మాగ్నస్ దాదాపు పూర్తి ఆధిపత్యం చెలాయించినట్లు కనిపించాడు. కానీ, చివరి దశలో తను చేసిన పెద్ద పొరపాటును గుకేశ్ సద్వినియోగం చేసుకున్నాడు.
ఈ ఓటమితో తీవ్ర నిరాశకు గురైన కార్ల్సన్ బోర్డుపై పిడికిలితో కొట్టాడు. ఆ తర్వాత చెదిరిపోయిన పావులను తిరిగి బోర్డుపై అమర్చి గుకేశ్ వీపుపై తట్టి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ విక్టరీతో గుకేష్ 8.5 పాయింట్లతో మూడో స్థానానికి చేరుకున్నాడు. కార్ల్సెన్, ఫాబియానో కరువానా 9.5 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నారు. తెలంగాణ జీఎం ఎరిగైసి అర్జున్.. చైనాకు చెందిన వీ యిపై ఆర్మగెడాన్ టై-బ్రేక్లో గెలిచాడు. అర్జున్ 7.5 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉన్నాడు. విమెన్స్ సెక్షన్లో ఇండియా యంగ్స్టర్ ఆర్. వైశాలి తోటి సీనియర్ ప్లేయర్ కోనేరు హంపిపై ఆర్మగెడాన్ టై-బ్రేక్లో విజయం సాధించింది.