హైదరాబాద్, వెలుగు: కేసీఆర్ అనుకుంటే కేటీఆర్ను సీఎం చేస్తారని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. కేటీఆర్ అన్ని పదవులు చేపట్టేందుకు సమర్థుడేనని ఆయన పేర్కొన్నారు. సోమవారం మండలిలోని తన చాంబర్లో మీడియాతో చిట్చాట్ చేశారు. రాజకీయ సమీకరణాల్లో భాగంగా ఇతర పార్టీల నేతలను చేర్చుకోవడం తప్పుకాదన్నారు. తెలంగాణ ఉద్యమకారులకు కేసీఆర్ అన్యాయం చేయబోరని తాను నమ్ముతున్నట్లు చెప్పారు. తనకు వచ్చిన రాజ్యాంగ పదవిలో సంతృప్తిగా ఉన్నానని, సీఎం ఏ బాధ్యత అప్పగించినా నిర్వర్తిస్తానని అన్నారు. కృష్ణా నీళ్లపై రాష్ట్ర ప్రభుత్వం న్యాయపోరాటం చేస్తుందని, ఏపీ ప్రభుత్వం అక్రమంగా కృష్ణా నీళ్లను మళ్లించుకుపోతామంటే ఒప్పుకోబోమని గుత్తా సుఖేందర్రెడ్డి స్పష్టం చేశారు.
భూమి కోసం మోహన్రెడ్డి తుపాకీ తీసిండు
పిలాయిపల్లి కెనాల్లో మాజీ మంత్రి గుత్తా మోహన్రెడ్డి భూమి 17 గుంటలు పోతుందని, దానికోసం గొడవ జరిగి తుపాకీ బయటకు తీశారని సుఖేందర్రెడ్డి అన్నారు. మోహన్రెడ్డితోపాటు నర్సింహారెడ్డి, మరొకరి భూమి పోతుందన్నారు. ఆ వీడియో బయటకొచ్చి చిన్న విషయం పెద్దగా మారిందన్నారు.