
హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు హాట్ కామెంట్స్ చేశారు. కేటీఆర్కు, నాకు వయసులో ఆరు నెలలే తేడా అని.. కేటీఆర్ నన్ను బచ్చా అనడం కరెక్ట్ కాదని చురకలంటించారు. ఇటీవల బీఆర్ఎస్ రాజీనామా చేసిన గువ్వల బాలరాజు ఆదివారం (ఆగస్ట్ 10) బీజేపీలో జాయిన్ అయ్యారు. హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ తెలంగాణ చీఫ్ రామచందర్ రావు గువ్వలకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా గువ్వల మాట్లాడుతూ.. ఇన్నాళ్లు నా వెంట నడిచిన కార్యకర్తలకు చెప్పకుండా బీఆర్ఎస్ కు రాజీనామా చేశానని, కార్యకర్తలు క్షమించాలని కోరారు. డైరెక్ట్గా బీజేపీలో చేరలేదని.. అన్ని పార్టీలను స్టడీ చేశాకే బీజేపీలో చేరా-నని తెలిపారు. పదవుల కోసం నేను బీజేపీలో చేరలేదని.. పార్టీలో సామాన్య కార్యకర్తగా పనిచేస్తానని పేర్కొన్నారు. 2009లో బీఆర్ఎస్ నుంచి ఎంపీగా పోటీ చేస్తే.. ఒక్క పార్టీ ఇన్ఛార్జ్ కూడా నా దగ్గరకు రాలేదని ఆరోపించారు.
►ALSO READ | కాళేశ్వరం ప్రాజెక్టుతో లక్ష కోట్లు వృధా.. ఆ డబ్బుతో పేదలందరికీ ఇండ్లు వచ్చేవి: మంత్రి వివేక్ వెంకటస్వామి
తెలంగాణ ఎవరివల్ల వచ్చిందో ప్రజల్లోకి తీసుకెళ్తానని అన్నారు. కేసీఆర్కు సీఎం పదవి దళితులు పెట్టిన భిక్ష అని తాను అనలేదని క్లారిటీ ఇచ్చారు. ప్రధాని మోడీ పాలన నచ్చే బీజేపీలో చేరానని స్పష్టం చేశారు. రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేయడమే కాకుండా అభివృద్ధిలోకి తీసుకొచ్చేందుకు తన వంతు పాత్ర పోషిస్తానని పేర్కొన్నారు. ప్రధాని మోడీతోనే దేశానికి రక్షణ అని అన్నారు.