
జ్ఞానవాపి మసీదు పరిసరాల్లో శివలింగం దొరికిన ప్రదేశంలో పూజలకు అనుమతి ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్ పై తీర్పును వారణాసి ఫాస్ట్ ట్రాక్ కోర్టు నవంబరు 17కు వాయిదా వేసింది. ఈవిషయాన్ని సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) మహేంద్ర పాండే వెల్లడించారని అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ గవర్నమెంట్ న్యాయవాది సులభ్ ప్రకాశ్ తెలిపారు. ఈ కేసులో అక్టోబరు 27న ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు.. తీర్పును నవంబరు 8 వరకు రిజర్వ్ చేసింది. అయితే జడ్జి సెలవులో ఉన్నందున తీర్పును నవంబరు 14 (సోమవారానికి) వాయిదా వేశారు. తాజాగా మరోసారి తీర్పును నవంబరు 17కు వాయిదా వేయడం గమనార్హం.
జ్ఞానవాపి మసీదు పరిసరాల్లో దొరికిన శివలింగానికి పూజలు చేసేందుకు అనుమతించడంతో పాటు ఆ ప్రదేశంలోకి ముస్లింల ప్రవేశాన్ని నిషేధించాలని, మసీదు సముదాయాన్ని హిందువులకు అప్పగించాలని పిటిషన్ దారులు కోరారు. శివలింగం వయసును తెలుసుకునేందుకు కార్బన్ డేటింగ్ చేయాలని హిందూ పక్షం వారణాసి కోర్టును కోరింది. అయితే ఈ అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. వారణాసి సివిల్ కోర్టు ఆదేశాల మేరకు గతంలో జ్ఞానవాపి మసీదును వీడియో సర్వే చేశారు. దీంట్లో వజూఖానాలో ఓ కొలనులో శివలింగం ఆకారం లభించింది. ఇది కాశీ విశ్వనాథుడి శివలింగమే అని హిందూ పక్షం చెబుతోంది. కాగా, ఇది కొలనులోని ఫౌంటేన్ అని ముస్లిం పక్షం వాదిస్తోంది. ఈ క్రమంలో వారణాసి కోర్టు నవంబరు 17న ఏం తీర్పు చెబుతుందో అనే ఆసక్తి అందరిలో నెలకొంది.