హైదరాబాద్: హకింపేట్ లోని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఓ అధికారి మృతి చెందారు. ఎయిర్ క్రాఫ్ట్ క్లీనింగ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు ఎజెక్షన్ సీట్ తలపై పడినట్లు తెలుస్తోంది. దీంతో తీవ్రంగా గాయపడిన ఎయిర్ ఫోర్స్ అధికారి.. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అయితే, ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఈ ప్రమాదం రెండు రోజుల క్రితం అంటే.. ఫిబ్రవరి 3వ తేదీన జరిగిందని అధికారులు వెల్లడించారు. చనిపోయిన ఆఫీసర్.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన హరి వీర్ చౌదరి గా అధికారులు తెలిపారు.
గాంధీ ఆసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం అధికారి భౌతికకాయాన్ని.. ఎయిర్ ఫోర్స్ అధికారులు ఉత్తరప్రదేశ్ కు తరలించినట్లు చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అల్వాల్ పోలీసులు తెలిపారు.