
- ఈ సీజన్లో 70.13 లక్షల టన్నుల సేకరణ టార్గెట్
- రాష్ట్రవ్యాప్తంగా రైతులపై రూ.385.71 కోట్ల భారం
- 2017 నుంచి హమాలీ చార్జీలపై చేతులెత్తేసిన సర్కారు
మంచిర్యాల, వెలుగు:రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరిస్తున్న ధాన్యం ఖర్చులన్నీ తానే చెల్లిస్తున్నానని కేంద్రం చెపుతున్నప్పటికీ, హమాలీ చార్జీలు మాత్రం ఇవ్వడం లేదు. దీంతో ఆ ఖర్చులను రైతులే భరిస్తున్నారు. పీపీసీ సెంటర్లలో హమాలీ చార్జీలు క్వింటాల్కు రూ.55 నుంచి రూ.60 చొప్పున వసూలు చేస్తున్నారు. ఒక రైతు 50 క్వింటాళ్ల వడ్లు అమ్మితే హమాలీ ఖర్చులకే రూ.2,750 చెల్లించాల్సి వస్తోంది.
కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర క్వింటాల్కు రూ.2,320 ఇస్తుండగా, ఇందులో రూ.55 హమాలీకే పోతున్నాయి. సంచుల్లో వడ్లు నింపి, కాంటా వేసి లారీల్లో లోడింగ్ చేయడం వరకు రైతుల సపోర్ట్ లేకుండా జరగడం లేదు. వీటితో పాటు ట్రాన్స్పోర్ట్ చార్జీలు మరో రూ.3 వేల నుంచి రూ.5 వేలు అవుతున్నాయి. ఇది రైతులకు భారంగా మారుతోంది.
రాష్ట్రవ్యాప్తంగా వందల కోట్లలో..
ఈ ఏడాది యాసంగి సీజన్లో రాష్ట్రవ్యాప్తంగా 57 లక్షల ఎకరాల్లో వరి పంట సాగైంది. 127.50 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చినట్లు వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇందులో 70.13 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు సేకరించాలని ప్రభుత్వం టార్గెట్గా పెట్టుకుంది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 7,337 సెంటర్లను ఏర్పాటు చేసింది. 7 కోట్ల ఒక లక్ష 30 వేల క్వింటాళ్ల వడ్లను సేకరిస్తోంది. క్వింటాల్కు సగటున రూ.55 చొప్పున లెక్కేస్తే రూ.385 కోట్ల 71 లక్షల 50 వేలు హమాలీ చార్జీలకే పోతున్నాయి.
చేతులెత్తేసిన సర్కారు..
ధాన్యం సేకరణకు సంబంధించి హమాలీ చార్జీలను గతంలో సర్కారే చెల్లించేది. క్వింటాల్కు రూ.5.30 ప్రభుత్వం చెల్లిస్తే, మిగతా మొత్తాన్ని రైతులు భరించేవారు. దీంతో వారికి కొంత వెసులుబాటు లభించేది. 2017 యాసంగి సీజన్ నుంచి ప్రభుత్వం హమాలీ చార్జీలను నిలిపివేసింది. అప్పటి నుంచి ఈ ఖర్చును రైతులే భరిస్తున్నారు. ఏటేటా చార్జీలు పెరుగుతుండడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు.
కొన్ని సెంటర్లలో హమాలీలు కాంటా వేయడానికే పరిమితం అవుతున్నారు. లారీల్లో లోడింగ్ చేయడానికి అదనంగా క్వింటాల్కు రూ.10 వరకు డిమాండ్ చేస్తున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయి. రోజురోజుకు పెట్టుబడులు పెరుగుతున్న నేపథ్యంలో హమాలీ, ట్రాన్స్పోర్టు చార్జీలు భారంగా మారుతున్నాయని రైతులు పేర్కొంటున్నారు.
ప్రభుత్వమే చెల్లించాలి..
కొనుగోలు సెంటర్లలో హమాలీ చార్జీలు క్వింటాల్కు రూ.60 చొప్పున తీసుకుంటున్నారు. ఈసారి నాకు 60 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. హమాలీ చార్జీలు రూ.3,600 చెల్లించాను. రోడ్డుకు కొంచెం దూరంగా ఉన్న వడ్లను కాంటా చేయడానికి రూ.65 వసూలు చేస్తున్నారు. హమాలీ చార్జీలను ప్రభుత్వం చెల్లిస్తే భారం తగ్గుతుంది.
– పెండ్యాల సాయిలు, భీమారం