సీఎం రిలీఫ్​ ఫండ్​.. కేసీఆర్ ఇంట్లకెళ్లి ఇస్తుండా?

సీఎం రిలీఫ్​ ఫండ్​.. కేసీఆర్ ఇంట్లకెళ్లి ఇస్తుండా?
  •    బీఆర్ఎస్​ టెలీ కాలర్​ను ప్రశ్నించిన దివ్యాంగుడు  
  •     ఈసారి బాల్క సుమన్​ఇంటికేనని సమాధానం​

మంచిర్యాల, వెలుగు : అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్​కు ఓటు వేసి గెలిపించాలంటూ తెలంగాణ భవన్​నుంచి ఫోన్​ చేసిన టెలీ కాలర్..​అవతలి వ్యక్తి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక తడబడ్డారు. మంచిర్యాల జిల్లా జైపూర్​మండలం ఇందారం గ్రామానికి చెందిన దివ్యాంగుడైన ఫయాజ్​ఖాన్ ​కాంగ్రెస్ ​మండల అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఆయనకు టెలీ కాలర్​ ఫోన్​చేసి ‘మీకు సీఎం రిలీఫ్ ఫండ్ ​రూ.60వేలు వచ్చింది కదా. ఈసారి ఎన్నికల్లో బీఆర్ఎస్​కు ఓటు వేసి కేసీఆర్, బాల్క సుమన్​ను గెలిపించండి’ అని కోరారు. దీనికి ఫయాజ్​ఖాన్​ ‘సీఎం రిలీఫ్​ ఫండ్​ ఏమన్నా కేసీఆర్, బాల్క సుమన్​ ఇంట్లకెళ్లి ఇచ్చిర్రా?’ అని ప్రశ్నించారు.

దీనికి టెలీ కాలర్ ​‘ఇలాంటి స్కీములు అమలు కావాలంటే కేసీఆర్​ సర్కారు రావాలి’ అంటూ చెప్పబోయారు. ‘కేసీఆర్​సర్కారు​ పిల్లలకు ఉద్యోగాలియ్యట్లే. మీకూ జాబ్ ​రాలే. మా ఊళ్లో 600కు పైగా దళిత కుటుంబాలుంటే.. బాల్క సుమన్​అనుచరుడికి మాత్రమే దళితబంధు వచ్చింది.ఆయనకు ఒక్కడికే వచ్చినందుకు సంతోషపడాల్నా? మిగతావాళ్లకు రానందుకు బాధపడాల్నా?’ అని ప్రశ్నించారు. ‘బాల్క సుమన్​స్థానిక నాయకులకు విలువ ఇయ్యట్లే. ఇందారం గ్రామంలో కాలిపోయి చనిపోయిన కుటుంబాన్ని ఇప్పటివరకు పరామర్శించలే.

అక్కడ కేసీఆర్ మంత్రులను కలువడు, ఎమ్మెల్యేలను కలువడు. ఇక్కడ బాల్క సుమన్ ​నాయకులను కలవడు, ప్రజలను కలవడు. ఈసారి బాల్క సుమన్​ ఇంటికే’ అని అన్నాడు. మీలాంటి పిల్లలకు ఉద్యోగాలు వస్తే సంతోషిస్తానని అనడంతో టెలీ కాలర్ థాంక్స్​చెప్తూ ఫోన్​ కట్​ చేశారు. ఈ సంభాషణ తాలూకూ ఆడియో సోషల్​మీడియాలో వైరల్ ​అయ్యింది.