హనుమకొండ, వెలుగు: ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలో మోసానికి పాల్పడిన ఓ అభ్యర్థిపై హనుమకొండ పీఎస్ లో కేసు నమోదైంది. ఈ నెల 12న ఈ ఘటన జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రంగారెడ్డి జిల్లా గట్టుఇప్పలపల్లి గ్రామానికి చెందిన సొప్పరి అభినయ్ ఈ నెల 11న ఫిజికల్ ఫిట్ నెస్, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ కు హాజరై అర్హత సాధించాడు. 12న నిర్వహించిన మెడికల్ స్క్రీనింగ్ టెస్టులో అన్ ఫిట్ అయ్యాడు. మెడికల్ ఎగ్జామినేషన్ తర్వాత ఆర్మీ రూల్స్ ప్రకారం ఆఫీసర్లు అందించే డాక్యుమెంట్స్ పై అభ్యర్థి ఫొటో అంటించాల్సి ఉండగా.. సొప్పరి అభినయ్ తన ఫొటోకు బదులుగా మరొకరి ఫొటో అంటించి ట్యాంపరింగ్ కు పాల్పడ్డాడు. దీనిని గుర్తించిన ఆఫీసర్లు సొప్పరి అభినయ్ పై 12వ తేదీన హనుమకొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు హనుమకొండ పోలీసులు సొప్పరి అభినయ్ పై 318(2), 319(2), 336(2), 336(3), 340(2) బీఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
