హైదరాబాద్ కోఠి మహిళా వర్సిటీ హాస్టల్లో వేధింపులు..

 హైదరాబాద్  కోఠి మహిళా వర్సిటీ హాస్టల్లో వేధింపులు..


    హాస్టల్లో ఉండాలంటేనే భయంగా ఉందని ఆవేదన
    షీటీమ్స్​కు ఆడియో రూపంలో ఫిర్యాదు

బషీర్​బాగ్, వెలుగు: కోఠిలోని వీరనారి చాకలి ఐలమ్మ మహిళా వర్సిటీలో వేధింపుల ఆరోపణలు కలకలం రేపాయి. వర్సిటీలో పీజీ చదువుతున్న విద్యార్థినులు, తాము ఉంటున్న ఉస్మానియా యూనివర్సిటీ గర్ల్స్‌ హాస్టల్లో మెస్‌ ఇన్​చార్జ్ వినోద్‌ తమను వేధిస్తున్నాడంటూ షీటీమ్‌ పోలీసులకు ఆన్​లైన్​ద్వారా ఫిర్యాదు చేశారు. తమ ఆవేదనను ఆడియో రూపంలో వెల్లడించారు. 

వినోద్‌ ప్రవర్తన వల్ల హాస్టల్​లో ఉండాలంటేనే భయంగా ఉందని, తమ భద్రత ప్రశ్నార్థకంగా మారిందన్నారు. వినోద్‌ వల్ల అనేక మంది విద్యార్థినులు మానసికంగా ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. ఈ విషయమై ఇప్పటికే హాస్టల్‌ వార్డెన్‌, కాలేజీ ప్రిన్సిపాల్​కు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే రహస్యంగా ఆన్​లైన్‌ ద్వారా షీటీమ్‌ పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చిందని తెలిపారు. తమ పేర్లు బయటకు వస్తే కెరీర్​కు, భవిష్యత్​కు ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉందని విద్యార్థినులు ఆందోళన వ్యక్తం చేశారు. అయినప్పటికీ ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు.ఈ ఘటనపై వెంటనే విచారణ చేపట్టి వినోద్​పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.