- ఫొటోలు మార్ఫింగ్ చేసి బ్లాక్ మెయిలింగ్
- ఈ ఏడాది సెప్టెంబర్ వరకు 2,451 కంప్లయింట్లు
హైదరాబాద్, వెలుగు: రాంగ్ కాల్స్ వేధింపులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల నుంచి గ్రేటర్ హైదరాబాద్ వరకు మహిళలకు రాంగ్ కాల్స్ ఎక్కువవుతున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్ వరకు 2,451 కేసులు నమోదయ్యాయి. గతేడాదితో పోల్చితే 10 శాతం పెరిగాయని, ఇలాంటి కాల్స్ పై స్పెషల్ ఫోకస్ పెట్టామని పోలీసులు చెప్పారు.
ట్రాప్ చేసే ప్రయత్నం..
ఆవారాలు గుర్తు తెలియని ఫోన్ నెంబర్లకి కాల్ చేస్తూ.. డీపీలో మహిళల ఫొటోలు కనిపిస్తే ట్రాప్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఫ్రెండ్ షిప్ పేరుతో మాయమాటలు చెప్తున్నారు. వాట్సాప్లో రిప్లై ఇచ్చిన వారితో చాటింగ్ స్టార్ట్ చేసి, పూర్తి ప్రొఫైల్ తెలుసుకుంటున్నారు. తర్వాత వాళ్లు చెప్పినట్లు వినకపోతే ఫొటోలు మార్ఫింగ్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. మొబైల్ రీచార్జ్ సెంటర్లు, కాల్ సెంటర్ల నుంచి మహిళల నెంబర్లను సేకరించి.. వారిని వేధింపులకు గురి చేస్తున్నారు.
ఫేక్ ప్రొఫైల్తో..
ఈ ఆవారాలు ఫేక్ ప్రొఫైల్తో ట్రూ కాలర్ ఐడీ క్రియేట్ చేస్తున్నారు. వాట్సాప్, ఇన్స్టాలో మెసేజెస్ చేస్తూ మహిళలను ట్రాప్ చేస్తున్నారు. ఓవైపు రాంగ్ కాల్స్, మరో వైపు చాటింగ్స్తో వేధింపులకు పాల్పడుతున్నారు. అమ్మాయిల ఫోన్ నెంబర్లు దొరికితే.. అసభ్యకరమైన ఫొటోలు, వీడియోలు పంపిస్తున్నారు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. షీ టీమ్స్, భరోసా సెంటర్లను ఆశ్రయిస్తున్నారు. కొంతమంది ఆన్ లైన్ లో కంప్లయింట్ చేస్తున్నారు.
అలాంటి కాల్స్ కు ఆన్సర్ చేయొద్దు..
ఎలాంటి వేధింపులకు గురైనా మాకు చెప్పాలి. తీవ్రతను బట్టి కేసులు నమోదు చేస్తాం. తెలిసినవాళ్లే ఫోన్లు చేసి వేధింపులకు పాల్పడుతున్నారు. కొంతమంది ఆవారాలు ఫేక్ ఐడీలతో సిమ్ లు తీసుకుంటున్నారు. అనుమానాస్పద కాల్స్ కు ఆన్సర్ చేయొద్దు.
- బి.సుమతి, డీఐజీ, విమెన్ సేఫ్టీ వింగ్
వేధింపుల ఫిర్యాదులివీ...
ఏడాది ఫోన్ కాల్స్ సోషల్ మీడియా బెదిరింపులు
2020 2,441 970 560
2021 (సెప్టెంబర్ వరకు) 1,585 268 598