దేశ ప్రజల భద్రతే అన్నింటికన్నా ముఖ్యం : హరీశ్​ రావు

దేశ ప్రజల భద్రతే అన్నింటికన్నా ముఖ్యం : హరీశ్​ రావు
  • పహల్గాం దాడి కలచివేసింది: హరీశ్​ రావు
  • మల్లారెడ్డి హెల్త్​ వర్సిటీలో ఆపరేషన్​ సిందూర్​కు సంఘీభావంగా కార్యక్రమం

హైదరాబాద్, వెలుగు: పహల్గాంలో మతం పేరు అడిగి టూరిస్టులను చంపడం ప్రజల మనసులను కలచివేసిందని మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే హరీశ్​ రావు అన్నారు. ఎన్నో ఏండ్లు ఓపికగా చూశామని, సహనానికీ ఓ హద్దు ఉంటుందని.. ఇకపై భరించే ఓపిక లేదన్నారు. దేశ ప్రజల భద్రతే అన్నింటికన్నా ముఖ్యమని చెప్పారు. శనివారం సూరారంలోని మల్లారెడ్డి హెల్త్ సిటీలో సైనికులు, ఆపరేషన్​ సిందూర్​కు సంఘీభావంగా నిర్వహించిన కార్యక్రమంలో హరీశ్ పాల్గొని మాట్లాడారు.

మన దేశ సైనికులను చూసి గర్వపడుతున్నామన్నారు. సరిహద్దులంటే భౌగోళికంగానే కాకుండా.. దేశ ప్రజల భద్రత, భవిష్యత్​ కూడా అని చెప్పారు. దానిని నిలబెట్టేందుకే సైనికులు పోరాడుతున్నారన్నారు. పాకిస్తాన్​ మన దేశం నుంచి విడిపోయినా.. మనల్ని ఇబ్బంది పెట్టందుకే ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నదని విమర్శించారు. ‘‘ముంబైలో తాజ్​హోటల్​పై పాక్​ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడి చేశారు.

వారంతా పాకిస్తాన్​ పంపిన టెర్రరిస్టులని ప్రపంచం ముందు ఆ దేశాన్ని దోషిగా నిలబెట్టాం. అమెరికా వంటి దేశాలపైనా బిన్​ లాడెన్​ లాంటి ఉగ్రవాదులు పాకిస్తాన్​ నుంచి దాడులకు తెగబడ్డారు. దేశం మీద జరుగుతున్న దాడికి పరిష్కారంగా ఉగ్రవాదులపై దాడి చేయడం సరైన చర్యే. ఇలాంటి సమయంలో దేశంలోని యువత త్యాగానికి సిద్ధంగా ఉండాలి’’ అని హరీశ్​రావు పేర్కొన్నారు.