
- ఒంటరిగా వంద సీట్లు గెలుస్తం: హరీశ్రావు
- ఎప్పుడు ఎన్నికలొచ్చినా కేసీఆర్ నాయకత్వంలోగులాబీ జెండా ఎగుర్తది
- స్థానిక ఎన్నికలు పెట్టేందుకు రేవంత్కు భయం
- దివాలా అని మాట్లాడేటోడే దివానాగాడు
- అతి చేస్తున్న ఆఫీసర్ల పేర్లు రెడ్బుక్లో ఎక్కిస్తున్నం
- వారంతా జాగ్రత్తగా ఉండాలని వార్నింగ్
- తెలంగాణ భవన్లో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా బీఆర్ఎస్ పార్టీ వంద సీట్లు గెలుస్తుందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ సొంతంగానే ఉంటుందని, ఒంటరిగానే పోటీ చేసి మళ్లీ అధికారంలోకి వస్తుందని అన్నారు. తాము పొత్తు పెట్టుకుంటమన్నట్టు ఎవరో మాట్లాడుతున్నారని, ఎవరితోనూ పొత్తు ఉండబోదని తెలిపారు. కేసీఆర్ నాయకత్వంలోనే మళ్లీ అధికారంలోకి వస్తామని అన్నారు. సోమవారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్లో వేడుకలు నిర్వహించారు. మండలి ప్రతిపక్ష నేత మధుసూదనా చారి జాతీయ జెండాను ఎగురవేశారు. పార్టీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. అనంతరం హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు.
స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లేందుకు సీఎం రేవంత్రెడ్డి భయపడుతున్నారని అన్నారు. బీఆర్ఎస్ కేడర్ ఎప్పుడైనా సిద్ధంగా ఉండాలని సూచించారు. కేసీఆర్పాలనలో రాష్ట్ర ఆదాయం ఆకాశంవైపు చూస్తే.. రేవంత్ పాలనలో నేలవైపు చూస్తున్నదని విమర్శించారు. కాంట్రాక్టర్ల దగ్గర 20 శాతం కమీషన్లు తీసుకుంటున్నారని ఆరోపించారు. ఇన్నాళ్లూ రాష్ట్రం దివాళా తీసిందంటూ దిక్కుమాలిన ప్రచారం చేశారని, దివాళా అంటూ ప్రచారం చేసేటోడే దివానాగాళ్లని మండిపడ్డారు. రేవంత్ తాను తీసుకున్న గోతిలో తానే పడ్డారన్నారు.
ఎవ్వరొచ్చినా కేసీఆర్పేరును చెరపలేరు..
కొందరు అధికారులు అతిగా వ్యవహరిస్తున్నారని, వాటన్నింటినీ గమనిస్తున్నామని హరీశ్ రావు అన్నారు. అక్రమ కేసులు పెట్టి సోషల్ మీడియా వారియర్స్ను వేధిస్తున్నారని ఫైర్ అయ్యారు. అతి చేస్తున్న అధికారులు కొంచెం జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. వారి పేర్లను రెడ్బుక్లో రాసి పెట్టాలని లీగల్ సెల్కు సూచించారు. తెలంగాణ రాష్ట్రం ఉన్నంత కాలం కేసీఆర్, బీఆర్ఎస్ పేర్లు ఉంటాయన్నారు. ప్రపంచ సుందరీమణులకు రేవంత్ చూపించినవి కేసీఆర్ కట్టిన సెక్రటేరియెట్, అంబేద్కర్ విగ్రహం, యాదాద్రి దేవాలయం, పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్, బుద్ధ భవన్ అని పేర్కొన్నారు. కేసీఆర్ లేకుంటే ఆవిర్భావ వేడుకలు ఎక్కడివి? కేసీఆర్ లేకుంటే ప్రస్తుతం తెలంగాణ ఆవిర్భావ వేడుకలు చేసుకునేవాళ్లమేనా? అని హరీశ్ రావు ప్రశ్నించారు.
3 సార్లు ఎంపీ, కేంద్ర మంత్రి, ఎమ్మెల్యే సహా ఎన్నోసార్లు తన పదవులకు రాజీనామా చేశారని గుర్తుచేశారు. ఆ త్యాగాల పునాదుల మీద తెలంగాణ పోరాటం చేశారని చెప్పారు. ‘‘డిసెంబర్ 9 ప్రకటనకు వ్యతిరేకంగా నాడు ఏపీ నాయకులు అడ్డుపడ్డరు. మేమందరం రాజీనామాలు చేయాలని నిర్ణయిస్తే.. టీడీపీలో ఉన్న రేవంత్ రెడ్డి జిరాక్స్ పేపర్ ఇచ్చిండు. ఒరిజినల్ రాజీనామా ఇవ్వలేదు. రాజీనామా చేసే ధైర్యం లేక వెన్నుచూపి పారిపోయిండు. ఒక్కనాడు కూడా ‘జై తెలంగాణ’ అనలేదు.. అమరులకు దండం పెట్టలేదు. పైగా ఉద్యమ కారులపైకి రైఫిల్ తో వెళ్లిండు. ప్రస్తుత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా రాజీనామా చేయకుండా వెన్ను చూపించిండు. ఇలాంటి వాళ్లు కేసీఆర్ను విమర్శిస్తారా? బీఆర్ఎస్, కేసీఆర్ లేకుంటే తెలంగాణ వచ్చి ఉండేదా గుండె మీద చెయ్యేసుకుని చెప్పాలి. గులాబీ జెండా పుట్టకపోయి ఉంటే స్వయంపాలన సాధ్యమయ్యేదా?’’ అని హరీశ్ రావు ప్రశ్నించారు.