వచ్చే ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తుండదు : హరీశ్​రావు

వచ్చే ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తుండదు : హరీశ్​రావు
  • ఒంటరిగా వంద సీట్లు గెలుస్తం: హరీశ్​రావు
  • ఎప్పుడు ఎన్నికలొచ్చినా కేసీఆర్​ నాయకత్వంలోగులాబీ జెండా ఎగుర్తది 
  • స్థానిక ఎన్నికలు పెట్టేందుకు రేవంత్​కు భయం
  • దివాలా అని మాట్లాడేటోడే దివానాగాడు
  • అతి చేస్తున్న ఆఫీసర్ల పేర్లు రెడ్​బుక్​లో ఎక్కిస్తున్నం
  • వారంతా జాగ్రత్తగా ఉండాలని వార్నింగ్​
  • తెలంగాణ భవన్​లో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు

హైదరాబాద్​, వెలుగు: రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా బీఆర్ఎస్​ పార్టీ వంద సీట్లు గెలుస్తుందని మాజీ మంత్రి, బీఆర్ఎస్​ ఎమ్మెల్యే హరీశ్​ రావు ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్​ సొంతంగానే ఉంటుందని, ఒంటరిగానే పోటీ చేసి మళ్లీ అధికారంలోకి వస్తుందని అన్నారు. తాము పొత్తు పెట్టుకుంటమన్నట్టు ఎవరో మాట్లాడుతున్నారని, ఎవరితోనూ పొత్తు ఉండబోదని తెలిపారు. కేసీఆర్​ నాయకత్వంలోనే మళ్లీ అధికారంలోకి వస్తామని అన్నారు. సోమవారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్​లో వేడుకలు నిర్వహించారు. మండలి ప్రతిపక్ష నేత మధుసూదనా చారి జాతీయ జెండాను ఎగురవేశారు.  పార్టీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. అనంతరం హరీశ్​ రావు మీడియాతో మాట్లాడారు. 

స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లేందుకు సీఎం రేవంత్​రెడ్డి​ భయపడుతున్నారని అన్నారు. బీఆర్ఎస్​ కేడర్​ ఎప్పుడైనా సిద్ధంగా ఉండాలని సూచించారు.  కేసీఆర్​పాలనలో రాష్ట్ర ఆదాయం ఆకాశంవైపు చూస్తే.. రేవంత్​ పాలనలో నేలవైపు చూస్తున్నదని విమర్శించారు. కాంట్రాక్టర్ల దగ్గర 20 శాతం కమీషన్లు తీసుకుంటున్నారని ఆరోపించారు.  ఇన్నాళ్లూ రాష్ట్రం దివాళా తీసిందంటూ దిక్కుమాలిన ప్రచారం చేశారని, దివాళా అంటూ ప్రచారం చేసేటోడే దివానాగాళ్లని మండిపడ్డారు. రేవంత్​ తాను తీసుకున్న గోతిలో తానే పడ్డారన్నారు.  

ఎవ్వరొచ్చినా కేసీఆర్​పేరును చెరపలేరు..

కొందరు అధికారులు అతిగా వ్యవహరిస్తున్నారని, వాటన్నింటినీ గమనిస్తున్నామని హరీశ్​ రావు అన్నారు. అక్రమ కేసులు పెట్టి సోషల్​ మీడియా వారియర్స్​ను వేధిస్తున్నారని ఫైర్​ అయ్యారు.  అతి చేస్తున్న అధికారులు కొంచెం జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. వారి పేర్లను రెడ్​బుక్​లో రాసి పెట్టాలని లీగల్​ సెల్​కు సూచించారు. తెలంగాణ రాష్ట్రం ఉన్నంత కాలం కేసీఆర్​, బీఆర్ఎస్​ పేర్లు ఉంటాయన్నారు. ప్రపంచ సుందరీమణులకు రేవంత్​ చూపించినవి కేసీఆర్​ కట్టిన సెక్రటేరియెట్​, అంబేద్కర్​ విగ్రహం, యాదాద్రి దేవాలయం, పోలీస్​ కమాండ్​ కంట్రోల్​ సెంటర్​, బుద్ధ భవన్​ అని పేర్కొన్నారు.  కేసీఆర్​ లేకుంటే ఆవిర్భావ వేడుకలు ఎక్కడివి? కేసీఆర్​ లేకుంటే ప్రస్తుతం తెలంగాణ ఆవిర్భావ వేడుకలు చేసుకునేవాళ్లమేనా? అని హరీశ్​ రావు ప్రశ్నించారు. 

3 సార్లు ఎంపీ, కేంద్ర మంత్రి, ఎమ్మెల్యే సహా ఎన్నోసార్లు తన పదవులకు రాజీనామా చేశారని గుర్తుచేశారు.  ఆ త్యాగాల పునాదుల మీద తెలంగాణ పోరాటం చేశారని చెప్పారు. ‘‘డిసెంబర్ 9 ప్రకటనకు వ్యతిరేకంగా నాడు ఏపీ నాయకులు అడ్డుపడ్డరు. మేమందరం రాజీనామాలు చేయాలని నిర్ణయిస్తే.. టీడీపీలో ఉన్న రేవంత్​ రెడ్డి జిరాక్స్​ పేపర్​ ఇచ్చిండు. ఒరిజినల్​ రాజీనామా ఇవ్వలేదు. రాజీనామా చేసే ధైర్యం లేక వెన్నుచూపి పారిపోయిండు. ఒక్కనాడు కూడా ‘జై తెలంగాణ’ అనలేదు.. అమరులకు దండం పెట్టలేదు. పైగా ఉద్యమ కారులపైకి రైఫిల్ తో వెళ్లిండు. ప్రస్తుత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్​ రెడ్డి కూడా రాజీనామా చేయకుండా వెన్ను చూపించిండు. ఇలాంటి వాళ్లు కేసీఆర్​ను విమర్శిస్తారా? బీఆర్ఎస్​, కేసీఆర్​ లేకుంటే తెలంగాణ వచ్చి ఉండేదా గుండె మీద చెయ్యేసుకుని చెప్పాలి. గులాబీ జెండా పుట్టకపోయి ఉంటే స్వయంపాలన సాధ్యమయ్యేదా?’’ అని హరీశ్​ రావు ప్రశ్నించారు.