
కల్వకుంట్ల కవిత ఆరోపణలపై పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి హరీశ్ రావు. బీఆర్ఎస్ లో కేసీఆరే సుప్రీం లీడర్ అని..కలిసి పనిచేయడం..ప్రజాసేవ చేయడమే కేసీఆర్ తమకు నేర్పించారని చెప్పారు. ఎవరి విషయంలోనైనా పార్టీదే తుది నిర్ణయమని అన్నారు హరీశ్.
లండన్ పర్యటనలో ఉన్న హరీశ్ రావు..బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ నేతల మీట్ ది గ్రీట్ ప్రోగ్రామ్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. మేడిగడ్డ 3 పిల్లర్లు కుంగితే రాద్దాంతం చేస్తున్నారని అన్నారు. ఏడాదిన్నర నుంచి ఈ ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. వానాకాలంలో విద్యుత్ డిమాండ్ ఎక్కువగా ఉండదని..ఆసమయంలో బాహుబలి మోటార్లతో నీటిని ఎత్తిపోసుకోవచ్చని సూచించారు. హైడ్రాతో హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారం కుప్పకూలిందన్నారు. ఎన్ఆర్ఐలు పెట్టుబడులు పెట్టడం లేదని విమర్శించారు హరీశ్ రావు.
హరీశ్,సంతోష్ అవినీతి అనకొండలు
బీఆర్ఎస్ పార్టీలో హరీశ్రావు, సంతోష్రావు అవినీతి అనకొండలు అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించిన సంగతి తెలిసిందే.. కేసీఆర్ ప్రస్తుత దుస్థితికి హరీశ్రావు, సంతోష్రావుతోపాటు మేఘా కృష్ణారెడ్డి కారణమని ఆరోపించారు. వాళ్ల వల్లే కేసీఆర్కు అవినీతి మరకలు అంటాయని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ పేరు చెప్పుకొని వారు లబ్ధి పొందారని, వాళ్ల వల్లే కేసీఆర్ బద్నాం అయ్యే పరిస్థితి వచ్చిందన్నారు కవిత.