ట్రబుల్ షూటర్‌‌‌‌కే ట్రబుల్!

ట్రబుల్ షూటర్‌‌‌‌కే ట్రబుల్!
  • అసెంబ్లీలో నీళ్లపై చర్చకు ముందు హరీశ్‌‌కు బాధ్యతలు
  • సడెన్‌‌గా సభ నుంచి బాయ్‌‌కాట్​చేసిన బీఆర్ఎస్​ పెద్దలు 
  • హరీశ్‌‌కు మైలేజ్ వస్తదన్న కారణంతోనే నిర్ణయమని చర్చ  
  • పార్టీ కార్యక్రమాల్లోనూ కేటీఆర్​ నుంచి తీవ్రమైన పోటీ 
  • కవిత కామెంట్లపై స్పందించని కేసీఆర్​, కేటీఆర్​

హైదరాబాద్, వెలుగు: ఒకప్పుడు బీఆర్ఎస్‌‌లో ట్రబుల్​షూటర్‌‌‌‌గా హరీశ్​రావు ఎంతో పేరు సంపాదించారు. పార్టీకి నష్టం జరిగిందనుకున్నప్పుడల్లా..  ఆయననే కేసీఆర్ రంగంలోకి దింపేవారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ ట్రబుల్​షూటర్‌‌‌‌నే ట్రబుల్స్ చుట్టుముడుతున్నాయని రాష్ట్ర రాజకీయాల్లో చర్చ జరుగుతున్నది. హరీశ్‌‌కు ముప్పేటా ముప్పు పొంచి ఉన్నదన్న వాదన వినిపిస్తున్నది. బీఆర్‌‌‌‌ఎస్ హైకమాండ్‌‌తో పాటు కవిత రూపంలో ఆయనకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 

ఇందుకు తాజాగా జరుగుతున్న పరిణామాలను ఉటంకిస్తున్నారు. రాజకీయ కార్యక్రమాల్లో కేటీఆర్​నుంచి పోటీ విపరీతంగా పెరగడం, అసెంబ్లీలో కృష్ణా నీళ్లపై ప్రభుత్వ పవర్​పాయింట్​ప్రజెంటేషన్‌‌కు కౌంటర్​ఇవ్వకుండా అర్ధంతరంగా సభను బాయ్‌‌కాట్​చేయడం, ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో అవినీతికి పాల్పడ్డారంటూ కవిత తరచూ ఆరోపణలు చేయడం వంటి కారణాలు.. హరీశ్‌‌ ట్రబుల్స్‌‌లో చిక్కుకున్నారని చెప్పడానికి నిదర్శనమని పేర్కొంటున్నారు. 

సభను లీడ్​చేసే అవకాశం ఇచ్చినట్టే ఇచ్చి..

గత బీఆర్ఎస్​ప్రభుత్వ హయాంలో కృష్ణా జలాల్లో జరిగిన అన్యాయంపై అసెంబ్లీలో పవర్​పాయింట్​ప్రజంటేషన్​ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ అంశంపై ప్రభుత్వానికి కౌంటర్​ఇచ్చేందుకు తొలుత హరీశ్ రావుకు కేసీఆర్ అవకాశం ఇచ్చారు. అందుకు అనుగుణంగానే ఆయనను డిప్యూటీ ఫ్లోర్​లీడర్‌‌‌‌గా నియమించారు. కానీ ఏమైందో ఏమో గానీ.. అసెంబ్లీ సమావేశాలను బాయ్‌‌కాట్​చేస్తున్నట్టు బీఆర్ఎస్ పెద్దలు శుక్రవారం సడెన్‌‌గా   ప్రకటించారు. ఇటీవల ప్రెస్‌‌మీట్​పెట్టిన కేసీఆర్.. ఇక తానే రంగంలోకి దిగుతున్నానని, తోలుతీస్తానని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో నీళ్ల అంశం మీద మాట్లాడితే తానే మాట్లాడాలని, లేదంటే హరీశ్‌‌కు మైలేజ్ వస్తుందన్న భావనతో సభను బాయ్‌‌కాట్​చేస్తూ కేసీఆర్‌‌‌‌ నిర్ణయం తీసుకున్నారన్న చర్చ జరుగుతున్నది. 

వాస్తవానికి నాడు ఇరిగేషన్​మంత్రిగా పనిచేసిన హరీశ్​రావుకు బాధ్యతలు అప్పగించడంతో.. సభలో ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేందుకు అవకాశం ఉంటుందని బీఆర్ఎస్ వర్గాలు భావించాయి. ఇప్పటికే పలు సందర్భాల్లోనూ ఇరిగేషన్ అంశాలపై ఎప్పటికప్పుడు హరీశ్.. ప్రభుత్వానికి కౌంటర్లు ఇచ్చారు. ఇదే క్రమంలో సభలో ప్రజంటేషన్​ఇచ్చేందుకు తమకూ అవకాశం ఇవ్వాలని సర్కార్‌‌‌‌ను ఆయన డిమాండ్ చేశారు. అయితే ఒకవేళ అసెంబ్లీలో నీళ్లపై హరీశ్‌‌ మాట్లాడితే ఆయనకే మైలేజ్ వస్తుందని భావించిన బీఆర్‌‌‌‌ఎస్ హైకమాండ్.. సభను బాయ్‌‌కాట్ చేస్తూ నిర్ణయం తీసుకుందన్న వాదన వినిస్తున్నది. 

కవిత ఇష్యూతో తలనొప్పి 

హరీశ్‌‌కు కవిత ఇష్యూ​మరో తలనొప్పిగా మారిందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. సందర్భం వచ్చినప్పుడల్లా హరీశ్​రావును టార్గెట్​ చేసుకుని ఆమె ఆరోపణలు చేస్తున్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో హరీశ్ అవినీతికి పాల్పడ్డారని, ఆయన వల్లే కేసీఆర్‌‌‌‌కు చెడ్డ పేరు వస్తున్నదని విమర్శించారు. తాజాగా శుక్రవారం మండలికి వచ్చిన కవిత.. పాలమూరు ప్రాజెక్టులో ఒక ప్యాకేజీని హరీశ్​అమ్మేసుకున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ట్రబుల్ షూటర్​కాదు.. బబుల్​షూటర్​అని విమర్శించారు.

హరీశ్ వల్లే పార్టీకి ట్రబుల్స్​అంటూ కామెంట్​చేశారు. అయితే ఇప్పుడు, ఇంతకుముందు హరీశ్ మీద కవిత చేసిన కామెంట్లకు ఇటు కేసీఆర్​నుంచి గానీ, అటు కేటీఆర్ నుంచి గానీ ఖండన రాలేదు. ప్రెస్‌‌మీట్‌‌లో గానీ, చిట్‌‌చాట్‌‌లో గానీ ప్రశ్నిస్తే.. ఆ టాపిక్‌‌ను సైడ్‌‌లైన్​ చేసిన సందర్భాలు ఉన్నాయి. మరోవైపు ఇటీవల కాలంలో బీఆర్ఎస్ వర్కింగ్​ప్రెసిడెంట్‌‌గా కేటీఆర్​చాలా యాక్టివ్‌‌గా ఉంటున్నారు. ఈ క్రమంలో పార్టీ కార్యక్రమాల్లో కేటీఆర్, హరీశ్ మధ్య పోటీ పెరిగిందనే వాదన వినిపిస్తున్నది.