
టీఆర్ఎస్ పార్టీ స్టార్ట్ క్యాంపెయినర్ల జాబితాలో సిద్ది పేట ఎమ్మెల్యే హరీశ్ రావును చేరుస్తూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఆ పార్టీ సోమవారం లేఖ అందజేసింది. ఎంపీ సంతోష్ కుమార్ స్థానంలో హరీశ్ కు చోటు కల్పించాలని లేఖలో విజ్ఞప్తి చేసింది. తాము ఇంతకుముందే అందజేసిన జాబితాలోని 15వ పేరు స్థానంలో హరీశ్ కు వాహన పాస్ అందజేయాలని కోరింది.మొదట టీఆర్ఎస్ 20 మందితో స్టార్ క్యాం పెయినర్ల జాబితాను ఆదివారం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి అందజేసింది. సీఎం కేసీఆర్,పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, 11 మంది మంత్రులు, ముగ్గురు రాజ్యసభ సభ్యులు, ఇద్దరు ఎమ్మెల్సీలు, ఇద్దరు పార్టీ ప్రధాన కార్యదర్శులకు ఈ జాబితాలో చోటు కల్పించారు.పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేసిన హరీశ్ కు జాబితాలో చోటు కల్పించకపోవడంపై విమర్శలొచ్చాయి. దీంతో సోమవారం ఆయన పేరును స్టార్ జాబితాలో చేర్చారు.