- ప్రశ్నిస్తే కేసులు.. నిరసిస్తే అరెస్టులుహక్కులడిగితే దాడులా?: హరీశ్రావు
- సూర్యాపేట, కోదాడ, మహబూబాబాద్, తిమ్మాజిపేట ఘటనలపై ఫైర్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఖాకీల జులుం మితిమీరిపోయిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు మండిపడ్డారు. తెలంగాణలో నడుస్తున్నది ప్రజల ప్రభుత్వమా? పోలీస్ రాజ్యమా? అని ప్రశ్నించారు. ప్రశ్నించే గొంతులను నొక్కేస్తూ కేసులు పెడుతున్నారని, నిరసన తెలిపేవారిని అరెస్టు చేస్తున్నారని, తమ హక్కుల కోసం పోరాడుతున్న సామాన్యులపై భౌతిక దాడులకు దిగుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్న ప్రజాపాలన అంటే ప్రజలపై పోలీసులతో దాష్టీకాలు చేయించడమేనా? అని సీఎం రేవంత్రెడ్డిని శుక్రవారం ఎక్స్ వేదికగా నిలదీశారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పేరుతో పోలీసులు సామాన్యులపై చేస్తున్న దౌర్జన్యాలు రోజురోజుకూ పెరుగుతున్నాయని హరీశ్రావు ఆరోపించారు. “మొన్న మహబూబాబాద్లో ఓ పోలీస్ అధికారి పాలిటెక్నిక్ విద్యార్థి గొంతు పిసికి క్రూరంగా ప్రవర్తించారు.
నిన్న నాగర్కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట పోలీస్ స్టేషన్లో తన కుమార్తెకు జరిగిన అవమానంపై న్యాయం చేయాలని ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన ఓ తండ్రిని బూటుకాళ్లతో తన్ని, మూత్రం తాగించారనే తీవ్రమైన ఆరోపణలు రావడం దారుణం” అని అన్నారు. అలాగే సూర్యాపేటలో సోషల్ మీడియాలో ప్రభుత్వ వైఫల్యాలపై పోస్టు పెట్టారనే కారణంతో అక్రమ కేసులు పెట్టారని, కోదాడలో పేదవాడి బడ్డీ కొట్టును అక్రమంగా తొలగించడాన్ని నిరసిస్తూ ఆందోళన చేసిన వారిపై స్థానిక సీఐ విచక్షణారహితంగా దౌర్జన్యం చేశారని ఫైర్అయ్యారు. రాష్ట్రంలో ఖాకీల అరాచకాలు మళ్లీ జరగకుండా చూడాల్సిన బాధ్యత పోలీస్ ఉన్నతాధికారులపై ఉందన్నారు. మహబూబాబాద్, నాగర్కర్నూల్, సూర్యాపేట, కోదాడ ఘటనల్లో దౌర్జన్యాలు, అమానుష చర్యలకు పాల్పడిన పోలీస్ అధికారులపై వెంటనే శాఖాపరమైన విచారణ జరిపించాలని డీజీపీని డిమాండ్ చేశారు.
