- పదేండ్లలో కేంద్రం ఒత్తిడి చేసినా మేం ఒప్పుకోలే
- పోతిరెడ్డిపాడు విస్తరణ టైమ్లో మేం మంత్రులుగానే లేం
- రాయలసీమ లిఫ్ట్కు ఏపీ 2020 మే 5న జీవో ఇస్తే మేం కేంద్రానికి ఫిర్యాదు చేసినం
- రేవంత్కు సబ్జెక్ట్ లేక గాయిగత్తర చేస్తున్నడు.. బూతులతో బుల్డోజ్ చేస్తున్నడు
- దగుల్భాజీతనాన్ని జనం ఎన్నటికీ సహించరు
- నీళ్లపై అసెంబ్లీలో ఎంతసేపైనా చర్చకు సిద్ధమని ప్రకటన
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే ప్రాజెక్టులను ఢిల్లీ చేతిలో పెట్టి అడుక్కుతినే పరిస్థితి తెచ్చిందని మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. పదేండ్లు కేంద్రం ఒత్తిడి తెచ్చినా తాము ప్రాజెక్టులను అప్పగించలేదని అన్నారు. సోమవారం తెలంగాణ భవన్లో హరీశ్రావు మీడియాతో మాట్లాడారు. ‘‘సీఎం రేవంత్రెడ్డి ప్రెస్మీట్లో మితిమీరిన అహంకారంతో సంస్కారంలేని వికారమైన భాషతో వితండవాదన చేసిండు. ఆయన మాటలు మొత్తం అబద్ధాలే. ప్రజలు ఆయన ధోరణిని చూసి సీఎం ఇట్ల మాట్లాడ్తరా అని అసహ్యించుకుంటున్నరు” అని అన్నారు. తాము రేవంత్లా మాట్లాడబోమని, సంస్కారంతో మాట్లాడుతామని ఆయన చెప్పారు. కేసీఆర్పై నీచమైన పద్ధతిలో వ్యక్తిగత దూషణలకు సీఎం రేవంత్ పాల్పడ్డారని మండిపడ్డారు. ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం ఎన్ని మాట్లాడినా పదేండ్లలో కేసీఆర్ వాటిని కేంద్రానికి అప్పగించలేదని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అప్పగించేశారని అన్నారు. జనవరి 17, ఫిబ్రవరి ఒకటిన కేంద్ర జలశక్తి శాఖ, కేఆర్ఎంబీ మినిట్స్లో శ్రీశైలం, నాగార్జున సాగర్ కంపోనెంట్స్అప్పగిస్తామని అంగీకరించినట్లు ఉందని తెలిపారు. నాగార్జునసాగర్పైకి తెలంగాణ ఇంజనీర్లు వెళ్లాలన్నా సీఆర్పీఎఫ్కు కేఆర్ఎంబీ ఆదేశాలు ఇవ్వాల్సిందేనని మినిట్స్లోనే ఉందని ఆయన చెప్పారు.
జనవరి 17న జలశక్తి శాఖ సమావేశంలోనే ప్రాజెక్టుల అప్పగింతకు రెండు రాష్ట్రాలు సానుకూలత వ్యక్తం చేశాయని, అదే జరిగితే రాష్ట్ర హక్కులను కోల్పోతామని తాను ప్రెస్మీట్ పెట్టి మాట్లాడే వరకు ప్రభుత్వం స్పందించలేదని హరీశ్ అన్నారు. ‘‘ఫిబ్రవరి 1న జరిగిన మీటింగ్లో హైడల్ ప్రాజెక్టులు మినహా మిగతా కంపోనెంట్లు ఇవ్వడానికి ఈఎన్సీ అంగీకరించారు. అదే విషయం మీడియాకు చెప్పారు. ప్రాజెక్టులు కృష్ణా బోర్డుకు అప్పగించేసి.. ఇప్పుడు తాము అప్పగించలేదంటూ రంకెలేస్తున్నరు” అని మండిపడ్డారు.
సెక్రటేరియెట్లో పచ్చి అబద్ధాలు
కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను ఢిల్లీకి తాకట్టు పెట్టిందని హరీశ్ ఆరోపించారు. అబద్ధపు పునాదుల మీద ప్రభుత్వాలు నడపాలని చూస్తున్నారని విమర్శించారు. రేవంత్ ప్రెస్మీట్లో అన్ని తప్పులే మాట్లాడారని దుయ్యబట్టారు. 2022లో నిర్వహించిన కేఆర్ఎంబీ16వ మీటింగ్లోనే కేసీఆర్ ప్రాజెక్టుల అప్పగింతకు ఒప్పుకున్నట్లు సీఎం చెప్పారని.. కానీ ఆ మినిట్స్లో తెలంగాణ ప్రాజెక్టులు అప్పగించలేదని ఉందని అన్నారు. ‘‘17వ మీటింగ్లో కృష్ణాలో 50 శాతం వాటా సహా కేఆర్ఎంబీ గెజిట్లోని లోపాలపై చర్చించడానికి అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని పట్టుబట్టినం. అదే విషయం ఆ సమావేశం మినిట్స్లోనూ ఉంది. ప్రాజెక్టులు అప్పగిస్తూ కేసీఆర్ స్వయంగా సంతకాలు పెట్టినట్లు సీఎం అబద్ధాలు చెప్పిండు. అసలు ఆ మీటింగ్కు కేసీఆర్ వెళ్లనే లేదు. సెక్రటేరియెట్లో సీఎం పచ్చి అబద్ధాలు చెప్పిండు. ఈ దగుల్భాజీతనాన్ని ప్రజలు సహించబోరు”అని కామెంట్స్ చేశారు.
అప్పుడు మేం మంత్రులుగా లేం
పోతిరెడ్డిపాడు విస్తరణ టైమ్లో తాము అసలు మంత్రులుగానే లేమని, పదవుల కోసం పెదవులు మూసుకున్నది సీఎం రేవంత్, ఆయన పక్కన ఇప్పుడు కూర్చున్న మంత్రులేనని హరీశ్ దుయ్యబట్టారు. ‘‘వైఎస్ పోతిరెడ్డిపాడు విస్తరణ తలపెడితే నాడు మా ఎమ్మెల్యేలు 40 రోజులు అసెంబ్లీని స్తంభింపజేశారు. మేం 2005 జులై 4న మంత్రి పదవులకు రాజీనామా చేసినం. పోతిరెడ్డిపాడు విస్తరణకు అప్పటి వైఎస్ ప్రభుత్వం అదే ఏడాది సెప్టెంబర్13న జీవో ఇచ్చింది. ఆ రోజు పోతిరెడ్డిపాడు విస్తరణపై మాతో గొంతు కలిపింది కాంగ్రెస్ నుంచి పీజేఆర్ ఒక్కరే. ఉల్టా చోర్ కొత్వాల్కో డాంటే అన్నట్టుగా రేవంత్ తీరు ఉంది. రాయలసీమ ఎత్తిపోతలకు ఏపీ ప్రభుత్వం 2020 మే 5న జీవో ఇస్తే అదే నెల 12న మేం కేంద్రానికి ఫిర్యాదు చేసినం. మా ఫిర్యాదుపైనే కేంద్రం రెండో అపెక్స్ కౌన్సిల్సమావేశం నిర్వహించింది. ఆ సమావేశంలోనే రాయలసీమ లిఫ్ట్ స్కీంను కేసీఆర్ వ్యతిరేకించినట్టుగా మీటింగ్మినిట్స్లో స్పష్టంగా ఉంది. ఇప్పుడు ఎవరిని ఎవరు చెప్పుతో కొట్టాలనే దానికి రేవంత్ సమాధానం చెప్పాలి” అని ఆయన వ్యాఖ్యానించారు.
సాగర్పై బలగాలను ఎందుకు తొలగించలే
సీఎం రేవంత్కు సబ్జెక్ట్లేక గాయి గత్తర చేస్తున్నారని, బూతులతో బుల్డోజ్చేయాలని చూస్తే ఊరుకోబోమని చెప్పారు. ‘‘సీఎం సరిగా ప్రిపేర్ కాకపోవడంతోనే బూతులు తిట్టిండు. కనీసం అసెంబ్లీకైనా ప్రిపేర్ అయి రావాలి. మీరు ఎన్ని గంటలు అడిగితే అన్ని గంటలు చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నం” అని హరీశ్ తెలిపారు. బీఆర్ఎస్ఎంపీలు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి షెకావత్పార్లమెంట్లో కలిసి ప్రాజెక్టుల స్వాధీనం పున: సమీక్షించాలని కోరితే అది ముగిసిన అధ్యాయం అని చెప్పారని, అంటే సీఎం ప్రాజెక్టుల అప్పగింతకు ఒప్పుకున్నది నిజమే కదా అని ఆయన ప్రశ్నించారు. రేవంత్ ప్రభుత్వం వచ్చి రెండు నెలలవుతున్నా నాగార్జునసాగర్పై సీఆర్పీఎఫ్ బలగాలను తొలగించి రాష్ట్ర పోలీసుల ఆధీనంలోకి ఎందుకు తీసుకురాలేదో ప్రజలకు సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.
అమరుల త్యాగాలను ఉత్తమ్ అవమానించిండు
‘‘తెలంగాణ ఉద్యమం వచ్చిందే నీళ్లలో జరిగిన అన్యాయంపైన. అలాంటిది ఉమ్మడి ఏపీలోనే బాగుండే అని మంత్రి ఉత్తమ్మాట్లాడటం ప్రొఫెసర్ జయశంకర్ సహా అమరుల త్యాగాలను అవమానించడమే. తెలంగాణ ఉద్యమ సమయంలో మంత్రి ఉత్తమ్ వైఎస్, కిరణ్కుమార్ రెడ్డి వెంట ఉన్నడు. నల్గొండ జిల్లాను ముంచే పులిచింతల ప్రాజెక్టును పోలీస్ పహారాలో నిర్మించేలా ఉత్తమ్ లాంటి వాళ్లు సహకరించిన్రు. కృష్ణా నీళ్లు సమైక్య రాష్ట్రంలో ఏపీకి తరలించుకుపోతే కేసీఆర్ హయాంలో పంటపొలాలకు తరలించారు” అని హరీశ్రావు అన్నారు.