- ఏపీలో సీనియర్ ఐపీఎస్లకు పట్టిన గతే మీకూ పట్టిస్తం
- రిటైర్ అయినా, విదేశాలకు పోయినా, సెంట్రల్ సర్వీసుల్లో ఉన్నా లాక్కొస్తం
- సీఎంకు వాస్తు భయం.. అందుకే సెక్రటేరియెట్కు రావట్లేదు
- పాలమూరుకు 7వేల కోట్లు ఖర్చు చేస్తే.. 7 గజాల కాల్వ తవ్వారా? అని ప్రశ్న
హైదరాబాద్, వెలుగు: కొందరు ఐపీఎస్లు పదవులు, ప్రమోషన్ల కోసం సీఎం రేవంత్ మెప్పు పొందేందుకు బీఆర్ఎస్ లీడర్లపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు ఆరోపించారు. ఫార్ములా ఈ కేసులో నిర్వాహకులు, స్పాన్సర్లను వదిలేసి కేవలం కేటీఆర్పై రాజకీయ కక్షతో కేసులు పెట్టారన్నారు.
ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసులో తనకు సిట్ నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. ‘‘అక్రమ కేసులు పెడుతున్న ఐపీఎస్ అధికారులంతా జాగ్రత్తగా ఉండాలి. ఉద్దేశపూర్వకంగా అక్రమ కేసులు పెడ్తే వడ్డీతో చెల్లిస్తాం’’అని ఆయన హెచ్చరించారు.
ఏపీలో సీనియర్ ఐపీఎస్లకు ఏ గతి పట్టిందో.. అదే గతి పట్టిస్తామన్నారు. రిటైర్ అయినా, విదేశాలకు పోయినా, సెంట్రల్ సర్వీసుల్లో ఉన్నా లాక్కొచ్చి కేసులు పెడ్తామన్నారు. మంగళవారం ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో చిట్చాట్ చేశారు. తమ దగ్గర ఖాకీ బుక్కు ఉందని డీజీపీ శివధర్ రెడ్డి చెబుతున్నారని.. తమ బుక్కులోనూ అందరి లెక్కలు రాస్తున్నామని హరీశ్ హెచ్చరించారు.
అసెంబ్లీలో పీపీటీకి అవకాశం ఇవ్వాలి
ఇరిగేషన్పై అసెంబ్లీలో ప్రభుత్వం పీపీటీ పెడతామంటున్నదని.. అలాగైతే, బీఆర్ఎస్కూ పీపీటీ ఇచ్చేందుకు అవకాశం ఇవ్వాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. సీపీఐ, ఎంఐఎం, బీజేపీల కన్నా తక్కువ టైం మైక్ ఇస్తున్నారని, ఎక్కువ మంది సభ్యులున్నా బీఆర్ఎస్కు ఆయా పార్టీలకన్నా ఎక్కువ సమయం ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు 45 టీఎంసీలకు డీపీఆర్ అప్రైజల్ ఇవ్వాలని కేంద్రానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ రాశారని హరీశ్ గుర్తుచేశారు. బీఆర్ఎస్ హయాంలో డీపీఆర్ వెనక్కొస్తే అనుమతులు ఎలా వస్తాయన్నారు. 90 టీఎంసీల కోసం 2023 లోనే కేంద్ర పర్యావరణ శాఖ అనుమతులు సాధించామని గుర్తు చేశారు. కాంగ్రెస్ హయాంలో డీపీఆర్ వెనక్కి వచ్చి ఏడాది అయినా ఉలుకు పలుకూ లేదన్నారు.
పాలమూరు రంగారెడ్డి కాల్వలకు 2023 నవంబర్లో టెండర్లు పిలిస్తే.. కాంగ్రెస్ వచ్చిన తర్వాత రద్దు చేసిందన్నారు. ‘‘పాలమూరు ప్రాజెక్టు కోసం రూ.7 వేల కోట్లు ఖర్చు చేశామని మంత్రి ఉత్తమ్ చెబుతున్నారు. కనీసం ఏడు గజాల కాలువైనా తవ్వారా” అని హరీశ్ప్రశ్నించారు. నీళ్లపై మంత్రి ఉత్తమ్తో బహిరంగంగా చర్చించేందుకు ప్రెస్క్లబ్, అసెంబ్లీ, ఏ టీవీ చానెల్ అయినా తాను సిద్ధమేనన్నారు. అలాగే, రాష్ట్ర ప్రభుత్వం 13 నెలల్లో 15,774 జీవోలను దాచేసిందని హరీశ్ రావు ఆరోపించారు. 2023 డిసెంబర్ 7 నుంచి 2025 జనవరి 26 వరకు 19,064 జీవోలు ఇవ్వగా.. అందులో కేవలం 3,290 జీవోలే పబ్లిక్ డొమైన్లో పెట్టారని మంగళవారం ట్వీట్ చేశారు.
కేసీఆర్ ప్రెస్మీట్తో డిఫెన్స్లో ప్రభుత్వం
కేసీఆర్ ప్రెస్మీట్ తర్వాత ప్రభుత్వం డిఫెన్స్లో పడిపోయిందని హరీశ్ రావు అన్నారు. ఒక సీఎం రాత్రి 9.30 గంటలకు చిట్చాట్ పెట్టడం తన రాజకీయ జీవితంలో మొదటిసారి చూశానని చెప్పారు. సీఎంకు వాస్తు భయం పట్టుకున్నదని, సెక్రటేరియెట్ గేట్లు మార్చినా, మరమ్మతులు చేసినా అటువైపు రావడం లేదని ఎద్దేవా చేశారు.
కమాండ్ కంట్రోల్ సెంటర్లోనే మంత్రులతో మీటింగులు పెట్టుకుంటున్నారన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు 4 వేలకుపైగా స్థానాలు రావడం చూసి అధికార పార్టీ భయపడుతున్నదని వ్యాఖ్యానించారు. రైతులకు మేలు చేసి ఉంటే.. ఎన్నికలు పెట్టొచ్చు కదా అని పేర్కొన్నారు.
