మొక్కలు తిన్న 3 మేకలను బంధించిన అధికారులు

మొక్కలు తిన్న 3 మేకలను బంధించిన అధికారులు

నారాయణ పేట జిల్లా : హరితహారం మొక్కలు తిన్న మేకల యజమానులకు భారీ జరిమానా వేస్తున్నా..అవి తినడం మానడంలేదు.. మొక్కలు పెరగడమూలేదు. ఇటీవల వికారాబాద్ జిల్లా చిలుకూరు ఆలయం ఏర్పాటు చేసిన నర్సరీలో హరితహారం మొక్కలను మేకలు తిన్నాయని యజమానికి రూ. 500 జరిమానా విధించారు. లేటెస్ట్ గా ఇలాంటి సంఘటనే మరోటి జరిగింది. ఈ సారి ఫైన్ భారీగా వేశారు. హరితహారం మొక్కలు తిన్నాయని 3 మేకలను బంధించారు అధికారులు. అంతేకాదు రూ. 10 వేలు ఫైన్ కూడా వేశారు. ఈ సంఘటన నారాయణపేట జిల్లాలో జరిగింది.

మక్తల్ శివారులోని మునిరాబాద్ రైల్వే లైన్ లో నాటిన హరితహారం మొక్కలను 3 మేకలు తిన్నందుకు యజమానికి రూ. 10 వేలు ఫైన్ వేశారు జిల్లా కలెక్టర్ వెంకట్ రావు.  డబ్బులు చెల్లించేవరకు మేకలను వదిలేది లేదని వాటిని ఎంపిడిఓ కార్యాలయంలో బంధించారు అధికారులు.

కరీంనగర్ లోనూ..

హుజురాబాద్ పోలీసు స్టేషన్ ఎదుట ఉన్న నాలుగు మొక్కలను ఓ మేక తినేసింది. గమనించిన మున్సిపల్ సిబ్బంది మేకను బంధించి ఒక్కో మొక్కకు 250 రూపాయల చొప్పున వెయ్యి రూపాయలు జరిమాన విధించారు. విషయం తెలుసుకున్న యజమాని మున్సిపల్ ఆఫీసుకు వెళ్లి.. తన దగ్గర డబ్బులు లేవని బ్రతిమిలాడిన అధికారులు వినలేదు. మధ్యవర్తి జమానత్ మేరకు అధికారులు మేకను వదిలేసినట్లు తెలిపాడు యజమాని.