
ఆసియా కప్ 2025 స్క్వాడ్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. టోర్నీకి మరో 20 రోజుల సమయం మాత్రమే ఉంది. దీంతో ఈ కాంటినెంటల్ టోర్నీకి 15 మందితో కూడిన టీమిండియాను మంగళవారం (ఆగస్టు 19) అధికారికంగా ప్రకటించనున్నారు. టీ20 ఫార్మాట్ లో జరగనున్న ఆసియా కప్ సెప్టెంబర్ 9 నుంచి సెప్టెంబర్ 28 వరకు జరగనుంది. సూర్య కుమార్ యాదవ్ భారత జట్టును నడిపించనున్నాడు. అక్షర్ పటేల్ లేదా హార్దిక పాండ్యాలలో ఒకరికి వైస్ కెప్టెన్సీ దక్కొచ్చు. ఈ మెగా టోర్నీ కోసం ప్రముఖ కామెంటేటర్ హర్ష భోగ్లే తన స్క్వాడ్ ను ఎంచుకున్నాడు.
టీ20 క్రికెట్ లో ఏడాది కాలంగా నిలకడగా రాణిస్తున్న అభిషేక్ శర్మ, తిలక్ వర్మలను బ్యాటర్లుగా ఎంచుకున్నాడు. కెప్టెన్ సూర్యతో పాటు శ్రేయాస్ అయ్యర్ ను హర్ష ఎంపిక చేశాడు. ఆల్ రౌండర్లుగా అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యలతో వాషింగ్టన్ సుందర్ కు ఛాన్స్ ఇచ్చాడు. వికెట్ కీపర్లుగా రెగ్యులర్ సంజు శాంసన్ తో పాటు, ఐపీఎల్ 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున అద్భుతంగా రాణించిన జితేష్ శర్మను సెలక్ట్ చేశాడు. ఇక ఫాస్ట్ బౌలర్లుగా జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్ లతో పాటు ఐపీఎల్ 2025 లో పర్పుల్ క్యాప్ గెలిచిన ప్రసిద్ కృష్ణ భోగ్లే స్క్వాడ్ లో ఎంపికయ్యారు. స్పిన్నర్లుగా వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్ లను తన జట్టులో చేర్చాడు.
ALSO READ : దులీప్ ట్రోఫీకి ఆకాశ్ దీప్, ఇషాన్ దూరం
ఆసియా 2025 లో మొత్తం ఎనిమిది జట్లు పోటీలో ఉండగా.. గ్రూప్–ఎలో ఇండియా, పాకిస్తాన్, యూఏఈ, ఒమన్.. గ్రూప్–బిలో శ్రీలంక, అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్, హాంకాంగ్ బరిలో నిలిచాయి. దుబాయ్, అబుదాబి వేదికలుగా ఓవరాల్గా 19 మ్యాచ్లు జరుగుతాయి. 2023లో జరిగిన గత ఎడిషన్లో రోహిత్ శర్మ కెప్టెన్సీలో టైటిల్ నెగ్గిన ఇండియా డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగనుంది. ఇండియా మ్యాచ్ ల విషయానికి వస్తే సెప్టెంబర్ 10న యుఎఇతో తొలి మ్యాచ్ ఆడుతుంది. సెప్టెంబర్ 14న పాకిస్థాన్తో హై-వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. రెండు మ్యాచ్లు దుబాయ్లో జరగనున్నాయి. సెప్టెంబర్ 19న అబుదాబిలో ఒమన్తో గ్రూప్ దశలో భారత్ చివరి మ్యాచ్ ఆడనుంది.