IND vs NZ: హర్షిత్ రానా పాంచ్ పటాకా.. కివీస్ స్టార్ ప్లేయర్‌కు పీడకలగా టీమిండియా పేసర్

IND vs NZ: హర్షిత్ రానా పాంచ్ పటాకా.. కివీస్ స్టార్ ప్లేయర్‌కు పీడకలగా టీమిండియా పేసర్

టీమిండియా యువ ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రానా న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ డేవాన్ కాన్వేకు చుక్కలు చూపిస్తున్నాడు. ఈ టూర్ లో ఈ కివీస్ ఓపెనర్ కు చేదు జ్ఞాపకంగా మిగిలాడు. ఒకటి కాదు రెండు కాదు ఐదు సార్లు కాన్వే వికెట్ హర్షిత్ రానా తీసుకోవడం ఆశ్చర్యకరంగా మారింది. ఈ టూర్ లో ఇప్పటివరకు ఆరు మ్యాచ్ లు జరిగితే ఐదు సార్లు కాన్వే వికెట్ ను రానా పడగొట్టాడు. మూడు వన్డేల సిరీస్ లో భాగంగా మూడు మ్యాచ్ ల్లోనూ కాన్వేను ఔట్ చేశాడు. ప్రస్తుతం జరుగుతున్న టీ20 సిరీస్ లో భాగంగా ఇప్పటివరకు జరిగిన మూడు టీ20 మ్యాచ్ ల్లో రెండు సార్లు కాన్వేను పెవిలియన్ కు చేర్చాడు. 

ఆదివారం (జనవరి 25) జరిగిన మూడో టీ20లో కాన్వే వికెట్ తీసుకున్న హర్షిత్ రానా మరోసారి కివీస్ ఓపెనర్ పై ఆధిపత్యం చూపించాడు.  ఈ మ్యాచ్ లో రానా వేసిన బంతిని కాన్వే మిడాఫ్ దిశగా ఆడాడు. టైమింగ్ మిస్ కావడంతో బంతి అక్కడే గాల్లో లేచింది. మిడాన్ లో ఫీల్డింగ్ చేస్తున్న పాండ్య వెనక వైపు నుంచి డైవ్ చేసి క్యాచ్ అందుకున్నాడు. న్యూజిలాండ్ తో నాగ్ పూర్ వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో కాన్వే వికెట్ అర్షదీప్ పడగొట్టాడు. అయితే ఈ మ్యాచ్ లో హర్షిత్ రానా ప్లేయింగ్ 11లో లేకపోవడం విశేషం. ఈ ఒక్క మ్యాచ్ మినహాయిస్తే మిగిలిన ఐదు మ్యాచ్ ల్లోనూ కాన్వే వికెట్ రానాకే దక్కింది. ఈ సిరీస్ లో మరో రెండు మ్యాచ్ లు ఉండడంతో వీరిద్దరి మధ్య సమరం ఆసక్తికరంగా మారడం ఖాయంగా కనిపిస్తుంది. 

టీమిండియా గ్రాండ్ విక్టరీ:
 
ఈ మ్యాచ్ విషయానికి వస్తే న్యూజిలాండ్ తో జరిగిన మూడో టీ20లో టీమిండియా విశ్వరూపం చూపించింది. ప్రత్యర్థి కివీస్ ను పసికూనగా మార్చేసి చిత్తుచిత్తుగా ఓడించారు. 154 పరుగుల టార్గెట్ ను కేవలం 10 ఓవర్లలోనే ఫినిష్ చేశారు. ఓపెనర్ అభిషేక్ శర్మ (20 బంతుల్లో 60: 7 ఫోర్లు, 5 సిక్సర్లు), కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ (26 బంతుల్లోనే 57: 6 ఫోర్లు, 3 సిక్సర్లు) విశ్వ రూపం చూపించి కివీస్ కు ఘోరమైన పరాభవాన్ని మిగిల్చారు. 

ALSO READ : తిలక్ వర్మ గాయంపై బీసీసీఐ అప్‌డేట్.. తెలుగు కుర్రాడు వరల్డ్ కప్ ఆడతాడా..?

ఆదివారం (జనవరి 25)  గౌహతి వేదికగా బర్సపారా క్రికెట్ స్టేడియంలో ముగిసిన ఈ మ్యాచ్ లో 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించారు. బౌలింగ్ లో బుమ్రా, బిష్ణోయ్ చెలరేగేడంతో పాటు బ్యాటింగ్ లో అభిషేక్ చుక్కలు చూపించి మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. ఛేజింగ్ లో ఇండియా మూడు వికెట్లు కోల్పోయి 10 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసి గెలిచింది. ఈ విజయంతో 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ ను ఇండియా మరో రెండు మ్యాచ్ లు మిగిలి ఉండగానే 3-0 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది.