తిన్నింటి వాసాలు లెక్కపెట్టడమంటే ఇదే: హర్యానాలో పాక్ ISI ఏజెంట్, యూట్యూబర్ జ్యోతి అరెస్ట్

తిన్నింటి వాసాలు లెక్కపెట్టడమంటే ఇదే: హర్యానాలో పాక్ ISI ఏజెంట్, యూట్యూబర్ జ్యోతి అరెస్ట్

చండీఘర్: పాక్ ఐఎస్ఐ అజెంట్‎గా పని చేస్తోన్న హర్యానాకు చెందిన ట్రావెల్ బ్లాగర్, యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెతో పాటు పాక్ ఐఎస్ఐతో సత్సంబంధాలు కొనసాగిస్తోన్న మరో ఆరుగురు భారతీయులను శనివారం (మే 17) అరెస్ట్ చేశారు. వీరంతా భారత్‎కు చెందిన సున్నితమైన సమాచారంతో పాటు, సైనిక రసహ్య సమాచారాన్ని పాక్‎కు చేరవేసినట్లు పోలీసులు గుర్తించారు. హర్యానా, పంజాబ్‎లో విస్తరించి ఉన్న ఈ ఇన్ఫార్మర్ నెట్‎వర్క్ డబ్బులకు ఆశపడి తిన్నింటి వాసాలు లెక్కపెడుతూ పాక్‎కు సమాచారాన్ని చేరవేస్తున్నట్లు కనుగొన్నారు.

కీలక నిందితురాలైన జ్యోతి మల్హోత్రా "ట్రావెల్ విత్ జో" అనే యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తోంది. ట్రావెలింగ్‎కు సంబంధించిన వీడియోలను యూట్యూబ్‏లో పోస్ట్ చేస్తుంటుంది. ఈ క్రమంలోనే 2023లో పాక్ ఐఎస్ఐ అజెంట్ల ద్వారా ట్రావెల్ వీసా మీద జ్యోతి పాకిస్థాన్‎లో పర్యటించింది. ఈ సందర్భంగా అక్కడ న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్‌లో పని చేస్తోన్న ఎహ్సాన్-ఉర్-రహీం అలియాస్ డానిష్‌తో ఆమె సన్నిహిత సంబంధాలను ఏర్పరచుకుంది. 

దీంతో జ్యోతిని పాకిస్తానీ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్ (PIO)లకు డానిష్ పరిచయం చేశాడు. ఇందులో ఓ పీఐవోతో ఆమె సన్నిహిత సంబంధం పెట్టుకుని బాలి వంటి విదేశీ పర్యటనలకు కూడా వెళ్లినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. వాట్సాప్, టెలిగ్రామ్, స్నాప్‌చాట్ వంటి ఎన్‌క్రిప్టెడ్ ప్లాట్‌ఫామ్‌లలో పాక్ ఐఎస్ఐ ఏజెంట్లతో జ్యోతి టచ్‎లో ఉంది. ఈ సందర్భంగా భారత్ లోని పలు ప్రాంతాలకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని వారికి చేరవేసింది.

►ALSO READ | 8647 పేరిట ట్రంప్‌‌కు బెదిరింపులు .. దర్యాప్తు చేపట్టిన యూఎస్ సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీలు

జ్యోతిపై భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 152, అధికారిక రహస్యాల చట్టం 1923లోని సెక్షన్ 3, 4, 5 కింద అభియోగాల కింద కేసు నమోదు చేశారు. జ్యోతితో పాటు మిగిలిన నిందితులు నేరం అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు. సామాజికంగా, ఆర్థికంగా బలహీనమైన వ్యక్తులను టార్గెట్ చేసి భావోద్వేగ సంబంధాలు, నగదు బహుమతులు,నకిలీ వివాహ వాగ్దానాల ద్వారా నిందితులను మోసగించారని అధికారులు తెలిపారు.

ఈ కేసును హిసార్‌లోని ఆర్థిక నేరాల విభాగానికి అప్పగించారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని.. మిగిలిన వివరాలు తర్వాత వెల్లడిస్తామని చెప్పారు. దాయాది దేశంతో ఉద్రిక్త పరిస్థితుల వేళ ఆ దేశ సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీ ఐఎస్ఐ కోసం పని చేస్తోన్న ఆరుగురు భారతీయులు పట్టుబడటం చర్చనీయాంశంగా మారింది.